‘రాగల 24 గంటల్లో’ ఫస్ట్‌ లుక్‌

Ragala 24 Gantallo First Look Poster Launch - Sakshi

‘‘ఆకాశవాణి.. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది’ అంటూ రేడియోలో వార్తలు వింటుంటాం. ఆ విధంగా రాగల 24 గంటల్లో చాలా ఫేమస్‌. బాగా పాపులర్‌ అయిన ‘రాగల 24 గంటల్లో’ అనే పదాలను తన సినిమా టైటిల్‌గా పెట్టుకున్నారు దర్శకుడు శ్రీనివాస్‌ రెడ్డి.  సత్యదేవ్, ఇషా రెబ్బా జంటగా శ్రీరామ్, ముస్కాన్‌ సేథ్, గణేశ్‌ వెంకట్రామన్‌ కీలక పాత్రల్లో నటించారు. శ్రీ నవ్‌హాస్‌ క్రియేషన్స్, శ్రీ కార్తికేయ సెల్యులాయిడ్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీనివాస్‌ కానూరి నిర్మాత. ‘ఢమరుకం’ శ్రీనివాస్‌ రెడ్డి దర్శకత్వంలో తెరరెక్కిన ఈ సినిమా మొదటి పోస్టర్‌ను నిర్మాత సి.కల్యాణ్, రెండో పోస్టర్‌ను శ్రీనివాస్‌ రెడ్డి బావ, పులివెందులకు చెందిన వ్యాపారవేత్త దంతులూరి కృష్ణ విడుదల చేశారు.
సి.కల్యాణ్‌ మాట్లాడుతూ– ‘‘వెరైటీ టైటిల్స్‌తో ఆసక్తికరమైన చిత్రాలను తీసి విజయాలను సాధించే దర్శకుడు శ్రీను. ఈ సినిమాను అద్భుతమైన స్క్రీన్‌ప్లే బేస్డ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దారని నాకు తెలుసు. ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన శ్రీనివాస్‌ కానూరికి మంచి పేరుతో పాటు లాభాలు రావాలి’’ అన్నారు. ‘‘నేను ఈ సినిమా రషెస్‌ చూశా. సత్యదేవ్, ఇషా, శ్రీరామ్‌ల నటన సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ఆర్టిస్ట్‌ల నుంచి నటన రాబట్టడం మా బావకు వెన్నతో పెట్టిన విద్య’’ అన్నారు దంతులూరి కృష్ణ. శ్రీనివాస్‌ రెడ్డి, శ్రీనివాస్‌ కానూరి, సంగీత దర్శకుడు రఘు కుంచె, ‘గరుడవేగ’ ఫేమ్‌ కెమెరామెన్‌ అంజి, ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top