హీరోకు పెట్టిన తర్వాతే నాకు తిండి పెడతామన్నారు

Neha Dhupia Comments On South India - Sakshi

బాలీవుడ్‌ ప్రముఖ నటి నేహా ధూపియా దక్షిణాది చిత్ర పరిశ్రమ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ హీరోలకే తొలి ప్రాధాన్యమని, హీరోయిన్లను చిన్నచూపు చూస్తారని పేర్కొన్నారు. తాజాగా ఓ షోకు హాజరైన ఆమె దక్షిణాదిలో హీరోయిన్లపై వివక్ష ఉందన్న విషయాన్ని అనుభవంతో సహా చెప్పుకొచ్చారు. ‘చాలాకాలం క్రితం జరిగిన సంఘటన ఇది. నేను ఓ దక్షిణాది సినిమా చేస్తున్నాను. ఓ రోజు షూటింగ్‌ చేస్తున్న సమయంలో నాకు ఆకలి వేసింది. దీంతో అక్కడున్న వారికి ఆహారం సిద్ధం చేయమని చెప్పాను. కానీ వాళ్లు ముందు హీరోకు పెట్టాలని చెప్పారు. నాకు ఆకలిగా ఉందని చెప్పినా కూడా పట్టించుకోలేదు. ముందు హీరో తిన్న తర్వాతే నాకు తిండి పెడతామన్నారు.’

‘థ్యాంక్‌ గాడ్‌.. ఇలాంటి అనుభవం మళ్లీ నాకు ఎదురుకాలేదు. అయితే ఈ విషయంపై నాకు ఏమాత్రం కోపం రాలేదు. పైగా నవ్వుకున్నాను కూడా’ అని నేహా ధూపియా చెప్పుకొచ్చారు. ‘నిన్నే ఇష్టపడ్డాను’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నేహా తెలుగులో చివరగా నందమూరి బాలకృష్ణ నటించిన ‘పరమ వీర చక్ర’ సినిమాలో కనిపించారు. 2018లో తన స్నేహితుడు, నటుడు అంగద్‌ బేడీని వివాహమాడారు. వీరికి మెహర్‌ అనే కూతురు ఉంది. కాగా నేహా ధూపియా ప్రస్తుతం బుల్లితెరలో వస్తున్న ప్రముఖ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top