సినీ ప్రముఖుల మెగా సమావేశం

meeting of film personalities - Sakshi

టాలీవుడ్‌ లో కొన్ని రోజులుగా జరుగుతున్న వివాదాల గురించి చర్చించుకోవడానికి పలువురు సినీ ప్రముఖులు మంగళవారం రాత్రి 7 గంటలకు సమావేశం అయ్యారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో ఈ సమావేశానికి వేదిక అయింది. నటుడు చిరంజీవి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘క్యాస్టింగ్‌ కౌచ్‌’ గురించి నటి శ్రీరెడ్డి చేసిన ఆరోపణల నుంచి ఇటీవలి కాలంలో ఇండస్ట్రీ చుట్టూ అల్లుకున్న వివాదాల వరకూ ఈ సమావేశంలో చర్చించుకున్నారని తెలిసింది. అయితే ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 25 మంది ప్రముఖులు సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ మెగా సమావేశంలో వెంకటేశ్, మహేశ్‌బాబు, జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, కల్యాణ్‌ రామ్, సుమంత్, రామ్, నాని, నాగచైతన్య, వరుణ్‌ తేజ్, అఖిల్, రాజ్‌ తరుణ్‌ వంటి నటులతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, పి. కిరణ్, ఎన్వీ ప్రసాద్, కేఎల్‌ నారాయణ, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నటి–నిర్మాత మంచు లక్ష్మీప్రసన్న, నటి–నిర్మాత–దర్శకురాలు జీవిత తదితరులు పాల్గొన్నారని సమాచారం. నటుడు బాలకృష్ణ హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. ఈ సమావేశం దాదాపు రెండు గంటలు జరిగినట్లు తెలిసింది. ‘క్యాస్టింగ్‌ కౌచ్‌’ గురించి, కొన్ని ఎలక్ట్రానిక్‌ చానల్స్‌పై ‘బ్యాన్‌’ గురించి చర్చించుకున్నారని భోగట్టా. చానల్స్‌పై నిషేధాన్ని కొందరు వ్యతిరేకించారట. మంగళవారం జరిగిన సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, మరో సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నారని తెలిసింది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాతో పంచుకునే అవకాశం ఉందని తెలిసింది.

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top