కోలీవుడ్‌కు మంజువారియర్‌ | Malayalam actress Manju Warrier is going to introduce Kollywood. | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌కు మంజువారియర్‌

Jul 4 2017 2:43 AM | Updated on Sep 5 2017 3:06 PM

కోలీవుడ్‌కు మంజువారియర్‌

కోలీవుడ్‌కు మంజువారియర్‌

ప్రముఖ మలయాళ నటి మంజువారియర్‌ కోలీవుడ్‌కు పరిచయం కానున్నారు.

తమిళసినిమా:  ప్రముఖ మలయాళ నటి మంజువారియర్‌ కోలీవుడ్‌కు పరిచయం కానున్నారు. 1995లో నటిగా రంగప్రవేశం చేసిన ఈ ప్రౌఢ వయసు నటి ఇన్నాళ్లకు తమిళ సినిమాలో నటించే అవకాశం పొందడం నిజంగా విశేషమే. మాలీవుడ్‌ నటుడు దిలీప్‌ను వివాహమాడి నటనకు దూరం అయిన మంజువారియర్‌కు ఒక కూతురు కూడా ఉంది. కాగా మనస్పర్ధల కారణంగా నటుడు దిలీప్‌ నుంచి విడాకులు పొందిన ఈమె మళ్లీ నటనపై దృష్టి సారించారు.

హౌ ఓల్డ్‌ ఆర్‌యూ చిత్రంతో రీ ఎంట్రీ అయిన మంజువారియర్‌ మళ్లీ హిట్‌ జాబితా హీరోయిన్లలో చేరారు. నటి జ్యోతిక నటించిన 36 వయదినిలే చిత్రం హౌ ఓల్డ్‌ ఆర్‌యూ చిత్రానికి రీమేక్‌నేన్నది గమనార్హం. కాగా ఈరం చిత్రంతో దర్శకుడిగా మోగాఫోన్‌ పట్టిన అరివళగన్‌ ఆ తరువాత పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇటీవల ఆయన తెరకెక్కించిన కుట్రం–23 చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందించింది. ఆయన తాజా చిత్రానికి సిద్ధమయ్యారు. ఈ సారి హీరోయిన్‌ ఇతివృత్తంతో కూడిన కథను హ్యాండిల్‌ చేయడానికి రెడీ అయ్యారు.

సంచలన సన్నివేశాలతో కూడిన థ్రిల్లర్‌ కథాంశంతో కూడిన ఇందులో నాయకిగా నటి నయనతారను నటింపజేయాలని ముందుగా భావించారట. అయితే ఆమె రూ.4 కోట్లు పారితోషికం డిమాండ్‌ చేయడం, అందకు ముందు నటించిన డోరా, తిరునాళ్, కాష్మోరా వంటి చిత్రాలు ఆశించిన విజయాలను సాధించక పోవడం వంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని మనసు మార్చుకున్నారని టాక్‌. కాగా తాజాగా తన చిత్ర నాయకి పాత్రకు మలయాళ సంచలన నటి మంజువారియర్‌ను ఎంపిక చేసుకున్నారని సమాచారం. చిత్ర షూటింగ్‌ నవంబర్‌ లేదా డిసెంబర్‌లో ప్రారంభం కానున్నట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement