వందేళ్ల సినిమా వేడుకలకు చెన్నై నగరం ముస్తాబు

వందేళ్ల సినిమా వేడుకలకు చెన్నై నగరం ముస్తాబు


చెన్నై: భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్యమండలి చెన్నైలో నిర్వహించే వేడుకలకు రంగం సిద్ధమైంది. వందేళ్ల సినిమా వేడుకలకు చెన్నై నగరం అంగరంగ వైభవంగా ముస్తాబైంది.  ఈ నెల 21 నుంచి 24 వరకూ ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ నెల 21న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆధ్వర్యంలో తమిళ సినిమా వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ నెల 22న ఉదయం కన్నడ చిత్రసీమ, సాయంత్రం తెలుగు సినిమా పరిశ్రమ వేడుకలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొంటారు. 


 


భారతీయ సినిమా పుట్టుక మొదలుకొని ప్రస్తుతం సాంకేతిక పరిజ్జానంలో వచ్చిన మార్పులను ఎంతవరకూ అందిపుచ్చుకున్నాం అనే  అంశాలను ఈవెంట్ ల రూపంలో వివరించనున్నారు. రాబోవు 100 సంవత్సరాల్లో   ఏ రకంగా ముందుకు వెళ్లాలనే అంశంపై ఒక మెగా ఈవెంట్ ను ఏర్పాటు చేశారు.

 


వందేళ్ల సినిమా వేడుకలకు తమిళనాడు ప్రభుత్వం భారీ విరాళం ప్రకటించి చేయూతనిచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో జరుగనున్న సినిమా వేడుకలను పురస్కరించుకుని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత రూ.10 కోట్లను విరాళంగా ప్రకటించారు.  శత జయంతి వేడుకల్లో భాగంగా తమిళనాడు ప్రభుత్వం భారీ మొత్తంలో విరాళం ప్రకటించడం విశేషం. ఈ మేరకు దక్షిణ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు కల్యాణ్ కు రూ.10 కోట్ల చెక్కును జయలలిత అందజేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top