మమ్మల్ని దండుపాళ్యం గ్యాంగ్‌ అంటున్నారు – పూజా గాంధీ | Dandupalyam 3' to hit theatres soon | Sakshi
Sakshi News home page

మమ్మల్ని దండుపాళ్యం గ్యాంగ్‌ అంటున్నారు – పూజా గాంధీ

Feb 28 2018 1:13 AM | Updated on Feb 28 2018 1:13 AM

Dandupalyam 3' to hit theatres soon - Sakshi

పరుచూరి వెంకటేశ్వరరావు, లయన్‌ కిరణ్, వీఐ ఆనంద్, పూజా గాంధీ, శ్రీనివాసరాజు

‘‘దండుపాళ్యం 3’ తర్వాత మరో రెండు మూడేళ్ల వరకూ ఈ జానర్‌లో సినిమాలు చేయను. రెండు భాగాల్లో కీలక పాత్రలు చేసిన నటీనటులే మూడో భాగంలోనూ చేశారు. కొన్ని పాత్రలకు మాత్రం వేరేవాళ్లను తీసుకున్నాం. ఈ మూడు భాగాలకు నాతో పాటు వర్క్‌ చేసిన డైలాగ్‌ రైటర్‌ రమేశ్, కెమెరామేన్‌ వెంకట్‌ప్రసాద్, ఎడిటర్‌ రవిచంద్రన్‌లకు థ్యాంక్స్‌. ‘దండుపాళ్యం’ సిరీస్‌లో ఇదే చివరిది’’ అని శ్రీనివాసరాజు అన్నారు. బొమ్మాళి రవిశంకర్, పూజా గాంధీ, మకరంద్‌ దేశ్‌పాండే, రవి కాలే ముఖ్య తారలుగా ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘దండుపాళ్యం 3’ని శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో సాయికృష్ణ ఫిలింస్‌ సమర్పణలో శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషపై శ్రీనివాస్‌ మీసాల, సాయికృష్ణ పెండ్యాల తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియో వేడుకలో పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘ఇప్పటికి మేం 365 చిత్రాలకి రాసాం. ఇప్పుడు మేము, శ్రీనివాసరాజు ఓ సినిమాకి పని చేస్తున్నాం.

తను ఏ సినిమా గురించైనా 365 రోజులు డిస్కస్‌ చెయ్యగలడు. అంత నాలెడ్జ్‌ ఉంది. వరుసగా సీక్వెల్స్‌తో హిట్స్‌ సాధిస్తున్నాడు. ఇప్పడు ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘మేం ఇంతకుముందు చేసిన పాత్రలను మరచిపోయి, ‘దండుపాళ్యం’లో చేసిన పాత్రలను గుర్తుపెట్టుకుంటున్నారు. మమ్మల్ని ‘దండుపాళ్యం’ గ్యాంగ్‌ అంటున్నారు. ఈ సినిమాలో చేసిన లక్ష్మీ పాత్ర కోసం నా బాడీ లాంగ్వేజ్, మాట తీరు మార్చుకోవాల్సి వచ్చింది’’ అని పూజా గాంధీ అన్నారు. ‘‘ఈ సినిమాలో మేం భయంకరమైనవాళ్లలా కనిపించినా రియల్‌గా అమాయకులం’’ అని మకరంద్‌ అన్నారు. ‘‘తెలుగులో ఎన్నో సినిమాలు చేసినా రాని గుర్తింపు ఈ సినిమాతో వచ్చింది’’ అని రవి కాలే చెప్పారు. ఈ వేడుకలో దర్శకుడు నక్కిన త్రినాథరావు, వీఐ ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement