హిట్టు కప్పు పట్టు

Bollywood actors playing sportsmen onscreen in 2019 - Sakshi

ప్రేక్షకులు అందించే హిట్‌ కప్పు కోసం కొందరు బాలీవుడ్‌ నటీనటులు క్రీడాకారులుగా రంగంలోకి దిగారు. ఒకరు పంచ్‌లు ఇస్తుంటే, మరొకరు సిక్సర్లు కొడుతున్నారు. ఇంకొకరు ఫైరింగ్, కొందరిది రన్నింగ్‌... ఇలా బాక్సాఫీస్‌ విన్నర్‌ కావడానికి ఎవరి ఆట వారు ఆడుతున్నారు. బాలీవుడ్‌ టోర్నీలో ప్రేక్షకులకు నచ్చినట్లు ఆడి హిట్‌ కప్పును పట్టుకోవడానికి ఎవరికి వారు చిత్రీకరణ పనులు మొదలుపెట్టారు. వారి ఆటల వివరాలు తెలుసుకుందాం.

పిల్లలకు ఉచితంగా ఫుట్‌బాల్‌ శిక్షణ ఇస్తున్నారు అమితాబ్‌ బచ్చన్‌. రిటైర్డ్‌ స్పోర్ట్స్‌ టీచర్‌గా తాను నటిస్తున్న చిత్రం కోసమే ఇలా చేస్తున్నారు. మరాఠీ సూపర్‌హిట్‌ ఫిల్మ్‌ ‘సైరట్‌’ ఫేమ్‌ నాగరాజ్‌ మంజులే ఈ చిత్రానికి దర్శకుడు. స్లమ్‌ స్కోరర్‌ అనే ఓ ఎన్‌జీఓ సంస్థను స్థాపించి పేద విద్యార్థులకు ఫుట్‌బాల్‌ శిక్షణ ఇప్పించిన నాగ్‌పూర్‌కు చెందిన విజయ్‌ బార్సే జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని బాలీవుడ్‌ సమాచారం. మరో స్టార్‌ అజయ్‌ దేవగన్‌ కూడా ‘మైదాన్‌’ చిత్రం కోసం ఫుట్‌బాల్‌ కోచ్‌గా మారారు.

అమితాబ్‌ బచ్చన్‌

పిల్లలకు ఉచితంగా ఫుట్‌బాల్‌ శిక్షణ ఇస్తున్నారు అమితాబ్‌ బచ్చన్‌. రిటైర్డ్‌ స్పోర్ట్స్‌ టీచర్‌గా తాను నటిస్తున్న చిత్రం కోసమే ఇలా చేస్తున్నారు. మరాఠీ సూపర్‌హిట్‌ ఫిల్మ్‌ ‘సైరట్‌’ ఫేమ్‌ నాగరాజ్‌ మంజులే ఈ చిత్రానికి దర్శకుడు. స్లమ్‌ స్కోరర్‌ అనే ఓ ఎన్‌జీఓ సంస్థను స్థాపించి పేద విద్యార్థులకు ఫుట్‌బాల్‌ శిక్షణ ఇప్పించిన నాగ్‌పూర్‌కు చెందిన విజయ్‌ బార్సే జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని బాలీవుడ్‌ సమాచారం. మరో స్టార్‌ అజయ్‌ దేవగన్‌ కూడా ‘మైదాన్‌’ చిత్రం కోసం ఫుట్‌బాల్‌ కోచ్‌గా మారారు.

అజయ్‌ దేవగన్‌

అమిత్‌ శర్మ ఈ చిత్రానికి దర్శకుడు. 1950–1963 సమయంలో ఇండియన్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌ కోచ్‌ కమ్‌ మేనేజర్‌గా పని చేసిన సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. బ్యాట్‌తో బరిలోకి దిగారు రణ్‌వీర్‌ సింగ్‌. 1983లో ఇడియన్‌ క్రికెట్‌ టీమ్‌ ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న నాటి మధుర జ్ఞాపకాల ఆధారంగా హిందీలో కబీర్‌ఖాన్‌ దర్శకత్వంలో తెర కెక్కుతోన్న ‘83’ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. అప్పటి ఇండియన్‌ టీమ్‌ కెప్టెన్, ఆల్‌ రౌండర్‌ కపిల్‌దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌సింగ్‌ కనిపిస్తారు.

రణ్‌వీర్‌సింగ్‌

క్రికెటర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ పాత్రలో కనిపించనున్నారు తమిళ నటుడు జీవా. ఈ చిత్రంలోనే కోచ్‌ మాన్‌సింగ్‌ పాత్రలో పంకజ్‌ త్రిపాఠీ కనిపిస్తారు. ఇండియన్‌ క్రికెట్‌ జట్టులో సభ్యుడు కావాలనుకునే ఓ 36 ఏళ్ల క్రీడాకారుడి పాత్రలో నటించబోతున్నారు షాహిద్‌ కపూర్‌. తెలుగు హిట్‌ ‘జెర్సీ’ చిత్రానికి ఇది హిందీ రీమేక్‌. తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన గౌతమ్‌ తిన్ననూరియే హిందీ రీమేక్‌ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. హీరో ఫర్హాన్‌ అక్తర్, దర్శకుడు ఓం ప్రకాష్‌ మెహ్రా కాంబినేషన్‌లో దాదాపు ఆరేళ్ల క్రితం విడుదలైన స్పోర్ట్స్‌ మూవీ ‘భాగ్‌ మిల్కా భాగ్‌’ సూపర్‌ హిట్‌గా నిలిచింది.

ఫర్హాన్‌ అక్తర్, షాహిద్‌ కపూర్‌

మళ్లీ వీరిద్దరూ మరో స్పోర్ట్స్‌ మూవీ ‘తుఫాన్‌’ను తెరకెక్కిస్తున్నారు. బాక్సింగ్‌ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో బాక్సర్‌ పాత్రలో ఫర్హాన్‌ కనిపిస్తారు.  2002లో లార్డ్స్‌ మైదానంలో జరిగిన నాట్‌వెస్ట్‌ సిరీస్‌ ౖఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై భారత్‌ చిరస్మరణీయమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విక్టరీ సెలబ్రేషన్స్‌లో భాగంగా సౌరభ్‌ గంగూలీ లార్డ్స్‌ స్టేడియంలో చొక్కా విప్పి చేసిన విజయ నినాదాన్ని క్రీడాభిమానులు అంత త్వరగా మర్చిపోలేరు.

ఈ హ్యాపీ మూమెంట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో ‘దూస్రా’ అనే సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి అభినయ్‌ డియోల్‌ దర్శకత్వం వహిస్తారని బీటౌన్‌ సమాచారం. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ పది మీటర్ల ఎయిర్‌రైఫిల్‌ షూటింగ్‌ వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధించిన అభినవ్‌ బింద్రా బయోపిక్‌ వెండితెరపైకి వస్తోంది. అభినవ్‌ బింద్రాగా నటించడానికి బాలీవుడ్‌ నటుడు హర్షవర్థన్‌ కపూర్‌ కమిట్‌ అయ్యారు. కన్నన్‌ అయ్యర్‌ దర్శకుడు. ఇవి కాకుండా మరికొన్ని స్పోర్ట్స్‌ మూవీలకు చర్చలు జరుగుతున్నాయి.

సూపర్‌ స్కోర్‌
బాలీవుడ్‌లో స్పోర్ట్స్‌ మూవీస్‌కి బాక్సాఫీస్‌ వద్ద ప్రత్యేకమైన స్థానం ఉంది. స్పోర్ట్స్‌ మూవీస్‌ బాక్సాఫీస్‌ వద్ద రికార్డు స్థాయి స్కోర్‌ని సాధిస్తున్నాయి. అందుకే బాలీవుడ్‌ దర్శక–నిర్మాతలు స్పోర్ట్స్‌ చిత్రాలవైపు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పొచ్చు. గత చిత్రాల బాక్సాఫీస్‌ గణాంకాలను ఓసారి పరిశీలించినప్పుడు 2007లో వచ్చిన షారుక్‌ ‘చక్‌దే ఇండియా’ని 20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. దాదాపు 127 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టిందీ చిత్రం.

ప్రియాంకా చోప్రాతో దాదాపు 18 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘మేరీ కోమ్‌’ చిత్రం వందకోట్లు వసూలు చేసిన మూవీ జాబితాలో చేరింది. దాదాపు రెండు వేల కోట్ల కలెక్షన్స్‌ను సాధించిన ఆమిర్‌ఖాన్‌ ‘దంగల్‌’ (2016) బడ్జెట్‌ 70 కోట్లు. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘భాగ్‌ మిల్కా భాగ్‌’ (201 3) చిత్రం 164కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇంకా ‘ఎమ్‌ఎస్‌ ధోని: ది ఆన్‌టోల్డ్‌ స్టోరీ’ (2016), ‘గోల్డ్‌’ (2018), ‘సూర్మ’(2018) చిత్రాలు కూడా బాక్సాఫీసు వద్ద హిట్‌ సాధించిన చిత్రాలే. మరికొన్ని స్పోర్ట్స్‌ చిత్రాలు కూడా చెప్పుకోదగ్గ వసూళ్లను రాబట్టాయి.

వెండితెర రేస్‌లో..
బాక్సాఫీస్‌ రేస్‌ కోసం నటీనటులు క్రీడాకారులుగా మారుతుంటే కొందరు నిజమైన క్రీడాకారులు యాక్టర్స్‌గా వెండితెరపై కనిపించబోతున్నారు. విక్రమ్‌ హీరోగా అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాతో వెండితెర యాక్టింగ్‌ ఓనమాలు మొదలుపెట్టారు క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌. మరో క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ తమిళ హీరో సంతానం నటిస్తున్న ‘డిక్కీలోనా’ సినిమాలో నటించనున్నారు. ఇక హన్సిక నటిస్తున్న ఓ తమిళ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు శ్రీశాంత్‌.

కంగన రనౌత్

ఒకే ఓవర్లో్లఆరు సిక్సర్లు కొట్టిన యువరాజ్‌ సింగ్‌ తండ్రి, ఇండియన్‌ మాజీ క్రికెటర్‌ యోగ్‌రాజ్‌ సింగ్‌ త్వరలో సౌత్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించనున్నారు. రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘దర్బార్‌’ సినిమాలో యోగ్‌రాజ్‌ ఓ కీలక పాత్ర చేశారని టాక్‌. ముంబై నేపథ్యంలో సాగే ‘దర్బార్‌’ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. గతంలో క్రికెటర్లు కపిల్‌ దేవ్, సడగోపన్‌ రమేష్‌ వంటి వారు తమ నటనా నైపుణ్యాన్ని ప్రేక్షకులు మెచ్చుకోవాలని వెండితెరపై ప్రయత్నించిన వారే. మరి.. భవిష్యత్తులో ఇంకా ఎంతమంది క్రీడాకారులు వెండితెర రేస్‌కి వస్తారో చూడాలి.

హర్భజన్‌ సింగ్

హీరోలే కాదు.. క్రీడా చిత్రాల్లో సత్తా చాటడానికి హీరోయిన్లు ఆట మొదలుపెట్టారు. హిట్‌ కప్‌ కోసం బరిలో నిలిచారు. ఏడాదికో ఆట ఆడాలని ప్లాన్‌ చేసుకున్నట్లున్నారు తాప్సీ. 2018లో  వచ్చిన హిందీ చిత్రం ‘సూర్మ’లో హాకీ క్రీడాకారిణిగా నటించిన తాప్సీ ఈ ఏడాది ‘సాంద్‌∙ఖీ ఆంఖ్‌’ సినిమా కోసం షూటర్‌గా మారిపోయారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓల్డెస్ట్‌ షార్ప్‌ షూటర్స్‌ చంద్రో, ప్రకాషీ తోమర్‌ జీవితాల ఆధారంగా తుషార్‌ హీరానందనీ దర్శకత్వంలో ‘సాంద్‌ కీ ఆంఖ్‌’ తెరకెక్కింది.

చంద్రో, ప్రకాషీల పాత్రల్లో భూమీ ఫడ్నేకర్, తాప్సీ నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. వచ్చే ఏడాది కూడా తాప్సీ ఓ క్రీడా చిత్రంలో కనిపించనున్నారు. ఆకర్ష్‌ ఖురానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రష్మీ: ద రాకెట్‌’ సినిమాలో గుజరాత్‌కు చెందిన అథ్లెట్‌ రష్మీ పాత్రలో నటిస్తున్నారామె. ఇక అశ్వనీ అయ్యర్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పంగా’ సినిమా కోసం కబడ్డీ ప్లేయర్‌గా కూత పెట్టారు కంగనా రనౌత్‌. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ యువతి జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎలా ఎదిగింది? అనే అంశం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

పరిణీతి చోప్రా

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ జీవితం ఆధారంగా ‘సైనా’ అనే బయోపిక్‌ తెరకెక్కుతోంది. అమోల్‌ గుప్తా దర్శకత్వంలో సైనా నెహ్వాల్‌ పాత్రలో పరిణీతీ చోప్రా నటిస్తున్నారు. ఇంకా క్రికెటర్‌ మిథాలీ రాజ్, టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా, బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుల బయోపిక్స్‌ తెరకెక్కనున్నట్లు ప్రకటనలు వచ్చాయి. వీరి బయోపిక్స్‌లో ఎవరు నటించబోతున్నారనే విషయంపై త్వరలో స్పష్టత రావాల్సి ఉంది.

– ముసిమి శివాంజనేయులు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top