
బయట టాప్ యాంకర్గా పేరు తెచ్చుకోవడమే కాక.. బిగ్బాస్ ఇంట్లోనూ టాప్ కంటెస్టెంట్గా పేరుగాంచిన ఏకైక వ్యక్తి శ్రీముఖి. ఎప్పుడూ అల్లరి చేస్తూ ఫుల్ ఎనర్జిటిక్గా ఉంటుంది. బిగ్బాస్ ఇచ్చే ఏ టాస్క్ అయినా వెనుకడుగు వేయకుండా పోరాడుతుంది. ఇక ఈ వారం రాహుల్ తప్ప శ్రీముఖితో సహా ఇంటి సభ్యులందరూ నామినేషన్లో ఉన్నారు. దీంతో వారిని ఎలిమినేషన్ నుంచి తప్పించడమే కాక టైటిల్ను సాధించడానికి గెలుపు బాటలు వేయడానికి అభిమానులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. వారికి నచ్చిన కంటెస్టెంట్ కోసం ప్రచారాన్ని ఊపందించారు. ఈ తరుణంలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు తమ గొంతు వినిపిస్తున్నారు. తమకి నచ్చిన వ్యక్తులకు ఓట్లు వేయండంటూ ప్రచారానికి దిగారు. ఈ నేపథ్యంలో శ్రీముఖిని గెలిపించాలంటూ జబర్దస్త్ టీం రంగంలోకి దిగింది.
జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ సోషల్ మీడియా వేదికగా శ్రీముఖికి తన మద్దతు తెలిపింది. తను నాకు వ్యక్తిగతంగా తెలుసని చెప్పుకొచ్చింది. గేమ్ అద్భుతంగా ఆడుతోందని.. దాన్ని అలాగే కొనసాగిస్తూ టైటిల్ కొట్టాలని కోరింది. నా ఫుల్ సపోర్ట్ శ్రీముఖికే అంటూ ప్రచారంలోకి దిగింది. ఇక జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ కూడా శ్రీముఖికి అండగా నిలిచాడు. బిగ్బాస్ షోను ఫాలో అవుతున్నానని.. అందులో తనకు ఇష్టమైన కంటెస్టెంట్ శ్రీముఖి అని పేర్కొన్నాడు. సెమీ ఫైనల్స్కు వచ్చిన ఆమె ఫైనల్కు తప్పకుండా వెళుతుందని ధీమా వ్యక్తం చేశాడు. శ్రీముఖిని బిగ్బాస్ విన్నర్గా చూడాలనుకుంటున్నానని, ఆమెకు ఓట్లు వేయండని వేడుకున్నాడు. దీంతో రాములమ్మ అభిమానులు.. ‘విన్నర్ శ్రీముఖి’ అంటూ మరింత దూకుడుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వీరి ప్రచారం ప్రేక్షకులపై ప్రభావాన్ని చూపిస్తుందా, లేదా అనేది తెలియాలి.