
పీకే సినిమాపై మరో ఎఫ్ఐఆర్!
అమీర్ఖాన్ ప్రయోగాత్మకంగా తీసిన 'పీకే' సినిమాను వివాదాలు వదలడం లేదు.
అమీర్ఖాన్ ప్రయోగాత్మకంగా తీసిన 'పీకే' సినిమాను వివాదాలు వదలడం లేదు. ఈనెల 19వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పటికే దాదాపు రూ. 135 కోట్లు వసూలు చేసినా.. పలు వివాదాల్లో కూరుకుపోయింది. హిందూ దేవుడైన శివుడిని ఈ సినిమాలో చెడుగా చూపించారని హిందూ లీగల్ సెల్ కార్యదర్శి అమీర్ఖాన్ మీద, సినిమా దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ మీద, నిర్మాతలు సిద్ధార్థ రాయ్ కపూర్, విధు వినోద్ చోప్రా మీద కేసు పెట్టారు. హిందూ ఆచారాలను కించపరిచేలా ఈ సినిమాలో కొన్ని వ్యాఖ్యలు ఉన్నట్లు పేర్కొన్నారు. 'భయపడేవాడే గుడికి వెళ్తాడు' లాంటి డైలాగులను కూడా ఆయన తన ఎఫ్ఐఆర్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
సినిమా విడుదలైన మూడు రోజుల తర్వాత ట్విట్టర్లో ఇప్పటికే 'బోయ్కాట్పీకే' పేరుతో ఓ ప్రచారం జరుగుతోంది. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో దీనికి పోటీగా 'వుయ్ సపోర్ట్ పీకే' అనే హ్యాష్ టాగ్తో మరో ప్రచారం కూడా జరుగుతోంది.