హైపర్‌లూప్‌కు పచ్చదనం తోడు

MAD Architects Design Urban Farming Infrastructure For Hyperloop Technology - Sakshi

బీజింగ్‌ : విమానం కంటే ఎక్కువ వేగంతో భూమ్మీదే ప్రయాణించేందుకు వీలు కల్పించే హైపర్‌ లూప్‌ టెక్నాలజీ ఇప్పుడు పర్యావరణ అనుకూలంగా మారింది. హైపర్‌లూప్‌ మార్గాల వెంబడి పచ్చదనాన్ని పెంచేందుకు ఎంఏడీ ఆర్కిటెక్ట్స్‌ అనే సంస్థ హైపర్‌లూప్‌ టీటీతో జట్టు కట్టింది. హైపర్‌లూప్‌ రైళ్లు గాలి లేని గొట్టాల్లో అయస్కాంత క్షేత్రంలో వెళ్తాయన్నది మనకు తెలిసిందే. ఈ గొట్టాల పైభాగంలో పాదచారుల కోసం ఏర్పాట్లు, స్తంభాల మధ్యభాగంలో వ్యవసాయం చేపట్టేందుకు వీలుగా ఎంఏడీ ఆర్కిటెక్ట్‌ ఒక డిజైన్‌ ప్రతిపాదిస్తోంది. నగర ప్రాంతాలను మినహాయిస్తే.. మిగిలిన చోట్ల గొట్టాల పైభాగంలో సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేసి, ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తుతోనే రైళ్లు నడుస్తాయని ఇప్పటికే దాదాపు నిర్ధారణ అయింది.

ఈ నేపథ్యంలో ఎంఏడీ ఆర్కిటెక్ట్స్‌ సిద్ధం చేసిన డిజైన్‌కు ప్రాచుర్యం లభిస్తోంది. దీని ప్రకారం సుమారు 23 అడుగుల ఎత్తైన స్తంభాలపై హైపర్‌లూప్‌ గొట్టాలు ఏర్పాటవుతాయి. దిగువభాగంలో అత్యాధునిక హైడ్రోపోనిక్స్‌ టెక్నాలజీతో పంటలు పండించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తారు. రెక్కలు అవసరం లేని పవన విద్యుత్తు కేంద్రాలను గొట్టం వెంబడి ఏర్పాటు చేయడం ద్వారా విద్యుదుత్పత్తి మరింత పెంచుతారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top