ఇండోనేసియాలో ఉగ్రదాడి | isis attacks in indonesia | Sakshi
Sakshi News home page

ఇండోనేసియాలో ఉగ్రదాడి

May 14 2018 3:11 AM | Updated on Nov 6 2018 8:16 PM

isis attacks in indonesia - Sakshi

ఉగ్ర దాడి జరిగిన చర్చి ప్రాంతం

సురబయ: ఇండోనేసియాపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన సురబయలోని మూడు చర్చిలపై ఆత్మాహుతిదళ ఉగ్రవాదుల దాడిలో 13 మంది మృతిచెందగా.. 41 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఓ మహిళ, ఓ చిన్నారి కూడా ఉన్నారు. ఇండోనేసియాలో మైనారిటీలైన క్రిస్టియన్‌లపై కొంతకాలంగా దాడులు జరుగుతున్నప్పటికీ.. 2000 తర్వాత వీరిపై ఉగ్రదాడి జరగటం ఇదే తొలిసారని స్థానిక పోలీసులు పేర్కొన్నారు. సురబయలోని సాంటామారియా రోమన్‌ కేథలిక్‌ చర్చిపై ఉదయం 7.30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) తొలిదాడి జరిగింది. ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులతోపాటు నలుగురు మృతిచెందారు. ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే సమీపంలోని క్రిస్టియన్‌ చర్చ్‌ ఆఫ్‌ డిపొనెగొరోలో రెండో ఉగ్రదాడి జరిగింది. వెంటనే మాంగెరలోని పెంతెకోస్ట్‌ చర్చ్‌పై ఉగ్రవాదులు దాడిచేశారు. ఘటన గురించి తెలియగానే ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో సురబయ చేరుకుని బాధితులకు అందుతున్న వైద్యసేవలను సమీక్షించారు.  ఈ ఘటనకు తామే బాధ్యులమని ఐసిస్‌ పేర్కొంది.

ఉగ్రవాదులంతా ఒకే కుటుంబం వారే
ఈ మూడు దాడుల్లో ఆరుగురు ఆత్మాహుతి బాంబర్లు పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. దాడులకు పాల్పడిన ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని.. ఇందులో ఇద్దరు బాలికలు కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. తల్లిదండ్రులతోపాటు ఇద్దరు కూతుళ్లు (9, 12 ఏళ్లు), ఇద్దరు యువకులు ఈ దాడిలో పాల్గొన్నారని వెల్లడించారు. ఈ కుటుంబమంతా ఇటీవలే సిరియానుంచి తిరిగి వచ్చిందని స్థానిక మీడియా పేర్కొంది.  

నలుగురు ఉగ్రవాదుల కాల్చివేత
ఆదివారం తెల్లవారుజామున వెస్ట్‌ జావా టౌన్స్‌లో నలుగురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు కాల్చిచంపారు. మరో ఇద్దరిని అరెస్టు చేశారు. అయితే ఈ ఘటనకు నిరసనగానే దాడి జరిగి ఉంటుందా? అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. అరెస్టయిన వారు ఇండోనేసియాలో దాడులకు పాల్పడుతున్న జేఏడీ సభ్యులని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement