
ప్రవాస తెలుగు బాలుడి ఘనత
భారత సంతతికి చెందిన పదమూడేళ్ల వెంకట సత్య శ్రీ రోహన్ చిక్కంకు యూనైటెడ్ కింగ్డం(యూకే)లోని మేధావుల క్లబ్ 'మెన్సా'లో స్థానం లభించింది.
భారత సంతతికి చెందిన పదమూడేళ్ల వెంకట సత్య శ్రీ రోహన్ చిక్కంకు యూనైటెడ్ కింగ్డం(యూకే)లోని మేధావుల క్లబ్ 'మెన్సా'లో స్థానం లభించింది. ఐక్యూ టెస్ట్లో 162 పాయింట్లకుగానూ రోహన్ ఏకంగా 161 పాయింట్లు సాధించి ఈ ఘనత సాధించాడు. కల్చర్ ఫెయిర్ స్కేల్, క్యాటెల్III బీ పేపర్లలో ఉత్తీర్ణత సాధించి దేశంలోనే టాప్ ఒక శాతం ప్రజ్ఞాశాలుల్లో ఉన్నందున రోహన్కు ఈ క్లబ్లో చేర్చుకోవడానికి అవకాశం కల్పించారు.
'రోహన్ ప్రాథమిక విద్య అభ్యసిస్తున్నప్పటి నుంచే గణితం, పజిల్స్లో తన టాలెంట్ చూపించే వాడు. గత ఏడాది గణితంలో యూకే మాథమెటికల్ చాలెంజ్లో గోల్డ్ సర్టిఫికెట్ పొంది తనను తాను నిరూపించుకున్నాడు' అని రోహన్ తండ్రి విష్ణు చిక్కం తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన విష్ణు చిక్కం గత 8 ఏళ్లనుంచి యూనైటెడ్ కింగ్డంలోనే నివసిస్తూ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. 'రోహన్కు గణితం, ఫిజిక్స్ అంటే చాలా ఇష్టం. గిటార్ వాయించడం, మెబైల్ ఆప్ డెవలప్ చేయడానికి ఎక్కువ సమయం కేటాయిస్తాడు. ఇటీవలే రోహన్ మొదటిసారిగా పోంగ్ రెట్రోస్కేప్ అనే మొబైల్ ఆప్ కూడా డెవలప్ చేశాడు' అని రోహన్ తండ్రి చెప్పారు.