అదనపు ఫీజులను ఉపేక్షించం | Ignore the additional fee | Sakshi
Sakshi News home page

అదనపు ఫీజులను ఉపేక్షించం

Oct 31 2013 4:43 AM | Updated on Sep 2 2017 12:08 AM

‘ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో‘కాలేజ్ డెవలప్‌మెంట్ ఫండ్’ పేరిట విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది.

సాక్షి, సిటీబ్యూరో: ‘ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో‘కాలేజ్ డెవలప్‌మెంట్ ఫండ్’ పేరిట విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. అంతేకాదు.. స్పోర్ట్స్, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, కమ్యూనికేషన్ స్కిల్స్.. అంటూ రకరకాలుగా విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజులు వసూలు చేయడం నేరం. అఫిలియేటెడ్ కళాశాలల్లో జరుగుతున్న ఈ తరహా దోపిడీని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు’ అని జేఎన్టీయూహెచ్ వైస్‌చాన్సలర్ రామేశ్వర్‌రావు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలను హెచ్చరించారు.

వర్సిటీ గుర్తిం పు పొందిన ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లతో మంగళవారం జేఎన్టీయూహెచ్‌లో సమావేశం నిర్వహించారు. వీసీ రామేశ్వర్‌రావు మాట్లాడుతూ.. విద్యా సంస్థలు విద్యార్థి ప్రగతిని కాంక్షిస్తూ ఏవైనా ప్రత్యేకమైన సేవలందిస్తే.. ఆయా సేవలకు గాను విద్యార్థులు చెల్లించిన సొమ్ముకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాల్సిందేనన్నారు. జేఎన్టీయూహెచ్ గుర్తింపు పొందిన కళాశాలల్లో విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజుల వివరాలను వర్సిటీ వెబ్‌సైట్లో ఉంచుతామన్నారు. ఈ ఏడాది నుంచి ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో యూనివర్సిటీ నిర్వహించిన తనిఖీల నివేదికలను కూడా వెబ్‌సైట్లో పెడతామన్నారు.
 
ర్యాగింగ్‌పై అప్రమత్తం

 అఫిలియేటెడ్ కళాశాలల్లో ర్యాగింగ్‌పై అప్రమత్తంగా ఉండాలని ప్రిన్సిపాల్స్‌కు వీసీ సూచించారు. రెండ్రోజుల కిందట నగర శివారులోని ఒక కళాశాల్లో ర్యాగింగ్ జరిగినట్లు సమాచారం అందిందని, వెనువెంటనే ప్రిన్సిపాల్స్‌కు ఫోన్ చేస్తే ఫోన్ స్విచాఫ్ వచ్చిందన్నారు. ర్యాంగింగ్ అరికట్టేందుకు జేఎన్‌టీయూహెచ్‌లో టోల్‌ఫ్రీ నం.18004251288ను ఏర్పాటు చేశామన్నారు.
 
రూ.20 కోట్ల సీఎస్‌ఎఫ్ బ కాయి

 అఫిలియేటెడ్ కళాశాలలు జేఎన్టీయూహెచ్‌కి చెల్లించాల్సిన కామన్ సర్వీస్ ఫీజు బకాయిలు రూ.20 కోట్లు దాటిందని వీసీ చెప్పారు. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అందినప్పటికీ.. యూనివర్సిటీకి ఫీజు చెల్లించని కళాశాలలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్సిటీలో ఇ-లెర్నింగ్, ఈఎంఎస్.. తదితర సాంకేతిక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు వీసీ తెలిపారు. రిజిస్ట్రార్ రమణరావు, రెక్టార్ సాయిబాబారెడ్డి, డెరైక్టర్లు దామోదరం, ఈశ్వర్‌ప్రసాద్, విశ్వనాథ్, విజయకుమారి, ఏఆర్‌కే ప్రసాద్, ఆర్యశ్రీ, వెంకటేశ్వరరావు, ముక్కంటి, మాధవీలత పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement