
పవిత్ర ఖురాన్ అవతరించిన శుభరాత్రి... షెబెఖద్
సంవత్సరంలోని పన్నెండు మాసాల్లో అత్యంత శుభప్రదమైన, మంగళప్రదమైన విశిష్ట మాసం రమజాన్. ఇందులోని ప్రారంభ దశ, అంటే మొదటి రోజులు కారుణ్యభరితమైనవి.
ఇస్లాం వెలుగు
సంవత్సరంలోని పన్నెండు మాసాల్లో అత్యంత శుభప్రదమైన, మంగళప్రదమైన విశిష్ట మాసం రమజాన్. ఇందులోని ప్రారంభ దశ, అంటే మొదటి రోజులు కారుణ్యభరితమైనవి. ఈ దశలో దైవ కారుణ్యం విశేషంగా వర్షిస్తుంది. రెండవ దశ క్షమాపణ, మన్నింపునకు సంబంధించినది. ఈ దశలో దైవం తన దాసుల తప్పుల్ని మన్నిస్తాడు. వారి పాపాలను క్షమించి తన కారుణ్య ఛాయలో చోటు కల్పిస్తాడు. ఇక మూడవది నరకాగ్ని నుండి విముక్తి దశ.
ఈ చివరి దశలో దైవం అసంఖ్యాక మానవులకు నరక జ్వాలల భయం నుండి విముక్తి కల్పిస్తాడు. ఇది చాలా కీలకమైన దశ. దీని ప్రాశస్త్యం చాలా గొప్పది. సంవత్సరంలోని పన్నెండు మాసాల్లో రమజానుకు ఎంతటి ప్రాముఖ్యం ఉందో ఈ మాసంలోని మూడు భాగాల్లో చివరి భాగానికి అలాంటి ప్రత్యేకత ఉంది. ఈ చివరి పది రోజుల్లోని ఒక రాత్రిలోనే ‘షబెఖద్’్ర ఉంది. దీన్నే ‘లైలతుల్ఖద్’్ర అని కూడా అంటారు. ఇది వేయి మాసాలకన్నా ఎక్కువ విలువైన రాత్రి. ఈ రాత్రిలోనే పవిత్ర ఖురాన్ గ్రంథం అవ తరించింది.
ఈ విషయాన్ని దైవం ఇలా ప్రకటించాడు: మేము ఈ ఖుర్ ఆన్ గ్రంథాన్ని ఒక విలువైన రాత్రిలో అవతరింపజేశాము. ఆ రాత్రి ఘనత ఏమిటో మీకు తెలుసా? అది వేయి మాసాలకన్నా అత్యంత విలువైన రాత్రి. దైవ దూతలు, ఆత్మ.. తమ ప్రభువు అనుమతితో, ప్రతి అనుజ్ఞతో ఆ రాత్రికి దిగివస్తారు. ఆ రాత్రి శుభోదయం వరకు శాంతియుతమైన రాత్రి (ఖుర్ఆన్ 97-1,5).
అందుకే రమజాన్ చివరి పది రోజుల్లో ఆరాధనలు ఎక్కువగా చెయ్యాలని, ఇందులోనే ఈ శుభరాత్రి ఉంది కనుక దానిని పొందాలని ప్రవక్త మహనీయులు ఉపదేశించారు. అయితే ఇక్కడ ఆ రాత్రి ‘ఫలానా రాత్రి’ అని కచ్చితంగా నిర్థారించబడలేదు. కానీ దానిని ఖచ్చితంగా ఎలా పొందవచ్చో ప్రవక్త మహనీయులు స్పష్టంగా వివరించారు. చివరి పది రోజుల్లోని బేసి రాత్రులలో దానిని అన్వేషించమని ఆయన ఉపదేశించారు.
అంటే 21, 23, 25, 27, 29 రాత్రులన్న మాట. ఎవరైతే ఆత్మ సంతోషంతో, పరలోక ప్రతిఫలాపేక్షతో ఆ రాత్రి ఆరాధనలో గడుపుతారో వారి పాపాలన్నీ మన్నించబడతాయి. ముఖ్యంగా వారు పవిత్ర ఖురాన్తో సంబంధాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే మానవ మనుగడకు దైవం ఈ ప్రపంచంలో చేసిన ఏర్పాట్లనీ ఒక ఎత్తయితే, పవిత్ర ఖురాన్ అవతరణ మరో ఎత్తు. ఈ ప్రబోధనా జ్యోతి మానవులకు జీవితంలోని అన్ని రంగాల్లో మార్గ దర్శనం చేసింది.
సామాజిక, సాంస్కృతిక , కౌటుంబిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, రాజకీయ తదితర సమస్త రంగాల్లో మానవుడు ఏ విధమైన జీవన విధానాన్ని అవలంబించాలో, ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలో సవివరంగా తెలియజేసింది. అందుకని ఈ పవిత్రమాసంలో ఖురాన్ను అధ్యయం చేయడానికి, అర్థం చేసుకోవడానికి, దాని ప్రకారం ఆచరించడానికి శక్తివంచన లేని ప్రయత్నం చేయాలి. అల్లా సమస్త మానవులకూ పవిత్ర ఖురాన్ బోధనలు అర్థంచేసుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక.
- యం.డి.ఉస్మాన్ఖాన్