చక్కెర వ్యాధి పూర్తిగా తగ్గుతుందా? | Ayurvedic Treatment for Sugar Patients | Sakshi
Sakshi News home page

చక్కెర వ్యాధి పూర్తిగా తగ్గుతుందా?

Nov 19 2013 12:00 AM | Updated on Sep 2 2017 12:44 AM

చక్కెర వ్యాధి పూర్తిగా తగ్గుతుందా?

చక్కెర వ్యాధి పూర్తిగా తగ్గుతుందా?

ఈ వ్యాధి గురించి ఆయుర్వేదంలో వివరించిన కొన్ని ముఖ్యాంశాలను మీరు అవగాహన చేసుకుంటే, అలాంటి ప్రకటనలు అవాస్తవాలనీ, మోసపూరితమనీ మీకే అర్థమవుతుంది.

 నా వయసు 65 ఏళ్లు. గత నాలుగేళ్లుగా డయాబెటిస్ వ్యాధికి మందులు వాడుతున్నాను. రక్తంలోని చక్కెర ప్రమాణాలు దాదాపు సక్రమంగానే ఉన్నాయిగాని, నరాల బలహీనత, శృంగార సమస్యల వంటివి ఇబ్బంది పెడుతున్నాయి. ఆయుర్వేద మందులు రెండు నెలలు వాడితే ఈ వ్యాధి శాశ్వతంగా పోతుందని కొన్ని ప్రకటనలు చూశాను. అలాగే పంచకర్మల చికిత్స వల్ల కూడా ఇది సంపూర్ణంగా పోతుందని విన్నాను. ఇది నిజమేనా? సరియైన ఆయుర్వేద మందులు, సలహాలు తెలియజేయప్రార్థన.
 - సత్యనారాయణ, భద్రాచలం

 
ఈ వ్యాధి గురించి ఆయుర్వేదంలో వివరించిన కొన్ని ముఖ్యాంశాలను మీరు అవగాహన చేసుకుంటే, అలాంటి ప్రకటనలు అవాస్తవాలనీ, మోసపూరితమనీ మీకే అర్థమవుతుంది. శరీరంలోని ధాతుపరిణామ వికారాల వల్ల మూత్రం రంగు, సాంద్రత, ఇతర స్వభావాలలో రకరకాల మార్పులు సంభవిస్తుంటాయి. వాటిని వాత, పిత్త, కఫ అని మూడు రకాలుగా వర్గీకరించారు. వీటినే ‘ప్రమేహ’రోగాలంటారు. వాతజ ప్రమేహ రోగాలలో ఒకటి మధుమేహం (డయాబెటిస్ మెల్లిటస్). ప్రాచీన సుప్రసిద్ధ వైద్యాచార్యుడు చరకమహర్షి దీన్ని అసాధ్యవ్యాధిగా స్పష్టం చేశాడు. ఇది స్వతంత్రం గానూ, ఆనువంశీకంగానూ కూడా రావచ్చు.

ఇది స్థూలకాయులకూ రావచ్చు. బక్క చిక్కినవారికీ రావచ్చు. ఈ వ్యాధిలో ‘ఓజోక్షయం’ ప్రధానంగా ఉంటుంది కాబట్టి శరీర కణాలకు శక్తి అందక ‘నీరసం’ ఎక్కువగా ఉంటుంది. అతిమూత్రం, అత్యాకలి, అతితృష్ణ ప్రధాన లక్షణాలు. ఈ వ్యాధి అసాధ్యమే అయినప్పటికీ సరియైన ఆహార విహార ఔషధాలను పాటించడం ద్వారా చక్కగా ‘నియంత్రణ’ చేసుకోవచ్చని చరక, సుశ్రుత, వాగ్భటులు ముగ్గురూ విశదీకరించారు. అశ్రద్ధ చేస్తే వచ్చే ఉపద్రవాలనూ ఉటంకించారు.

కన్ను, గుండె, మూత్రపిండాల వంటి ముఖ్యభాగాలు క్రియాసామర్థ్యాన్ని కోల్పోవడం జరుగుతుంది. నరాలు, రక్తనాళాలు దెబ్బతింటాయి. శృంగార సామర్థ్యలోపం, ముఖ్యంగా రాచకురుపులు, అంగస్తంభన లోపించడం కూడా ఉపద్రవాలే. ఈ కింది సూచనలను జీవితాంతం అనుసరిస్తే ఈ వ్యాధి అణిగిమణిగి ఉంటుందే కాని, ఏ ప్రమాదమూ కలుగజేయజాలదు. త్రిపాద సూత్రాలను పాటించడం ముఖ్యం.
 
 ఆహారం: తీపి, ఉప్పు, కొవ్వు పదార్థాలను శాశ్వతంగా దూరం చేయండి. జిహ్వ చాపల్యం కోసం నెలకొకసారి తిన్నా పర్వాలేదు. మాంసకృత్తులు అధికంగా ఉండే బలకరాహారం, ఖనిజలవణాలుండే ఆకుకూరలు, శాకజాలాలకు ప్రాధాన్యమివ్వండి. మొలకలు, గ్రీన్‌సలాడ్స్ బాగా తినాలి. తక్కువ ప్రమాణంలో ఎక్కువ పర్యాయాలు తినడం మంచిది. ద్రవాహారం బాగా సేవించాలి. పీచుపదార్థాలున్న ఆహారం మంచిది. పుల్కాలకు, ముడిబియ్యపు అన్నానికి ప్రాధాన్యమివ్వండి.
 
 విహారం : రోజూ కనీసం 45 నిమిషాలు శారీరక వ్యాయామం తప్పనిసరి. నడక, ఆటలు, యోగాసనాలు, బరువుపనులు చేయడం వంటివన్నీ వ్యాయామం కిందికే వస్తాయి. చరక మహర్షి వ్యాయామ ప్రాశస్త్యం గురించి ప్రత్యేకంగా విశదీకరించాడు. రెండుపూటలా ప్రాణాయామం చెయ్యటం వల్ల ఎనలేని ప్రయోజనం కలుగుతుందని గుర్తుంచుకోండి. సమయానుగుణంగా నిద్ర, విశ్రాంతి వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇది కూడా  వ్యాధి చికిత్సకు ప్రధానాంశమే.
 
 ఔషధం :
త తిక్త (చేదు) రస ప్రధానాలైన మూలికలన్నీ ఈ వ్యాధిని తగ్గించడానికి ఉపకరిస్తాయి. ఉదాహరణకు వేప, మెంతులు, పసుపు, నేలవేము, కలబంద, కాకర, అడ్డసరం, తిప్పతీగె, చేదుపొట్ల మొదలైనవి. ఇతర మూలకల్లో ప్రధానమైనవి తులసి, మారేడు, దాల్చినచెక్క, నేరేడు, అల్లం, శుంఠి, వెల్లుల్లి, త్రిఫల మొదలైనవి.
 
 బజారులో లభించే ఔషధాలు :
 చంద్రప్రభావటి, శిలాజిత్వాదివటి, డయాబెకాన్, హైపోనిడ్ మొదలైనవి.
 
 రసాయనాలు : (ఉపద్రవాలను నివారిస్తూ, ధాతుపుష్టి కలిగించేవి).
 స్వర్ణభస్మం, ముక్తాభస్మం, అభ్రకభస్మం, యశదనాగభస్మాలు, రజతభస్మం, వసంతకుసుమాకరం మొదలైనవి.
 
 గమనిక :   
 ఈ వ్యాధి విషయంలో ఎవరూ సొంతవైద్యం చేసుకోవద్దు  
 వాడుతున్న ఇంగ్లిషు మందులను ఒక్కసారిగా మానేయవద్దు  
 క్రమం తప్పకుండా బ్లడ్‌షుగర్ పరీక్షలను చేయించుకోవాలి  
 వ్యాధి తీవ్రతను బట్టి, ఎంతకాలం నుంచి ఉన్నదన్న అంశాన్ని బట్టి, ఏయే ఆయుర్వేదిక్ మందులను, ఎంత మోతాదులో, ఎంతకాలం వాడాలి, ఎప్పుడు మందుల్ని మారుస్తుండాలి అన్న విషయాలను కేవలం ఆయుర్వేద నిపుణులు మాత్రమే నిర్ణయించగలరు.  కువైద్యుల ప్రకటనలకు మోసపోవద్దు.
 
 డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
 అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్),
 సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్,
 హుమయున్ నగర్, హైదరాబాద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement