ఓ వృద్ధుడు స్టేషన్ సమీపంలో పడిపోయి ఉండటంతో చలించిన పోలీసులు అతనికి మంచి బట్టలు తొడిగి ఆస్పత్రికి తీసుకొని వెళ్లారు.
ప్రొద్దుటూరు క్రైం: ఓ వృద్ధుడు స్టేషన్ సమీపంలో పడిపోయి ఉండటంతో చలించిన పోలీసులు అతనికి మంచి బట్టలు తొడిగి ఆస్పత్రికి తీసుకొని వెళ్లారు. దువ్వూరుకు చెందిన వెంకటసుబ్బయ్య అనే వృద్ధుడికి నా అన్న వాళ్లు ఎవ్వరూ లేరు. అతనికి నాలుగు రోజుల క్రితం కామెర్లు సోకాయి. అయితే ఎక్కడికి వెళ్లలేని స్థితిలో ఉన్న అతను స్టేషన్ సమీపంలోనే కుప్పకూలి పోయాడు. నాలుగు రోజులుగా అక్కడే పడిపోయి ఆహారం లేకపోవడంతో బక్కచిక్కిపోయాడు. అందరూ చూస్తున్నారే గానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. అతని పరిస్థితిని చూసి చలించిన త్రీ టౌన్ కానిస్టేబుళ్లు ప్రసాద్, నాగరాజు, సహారా వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి నరేంద్ర శనివారం సాయంత్రం వృద్ధుడికి మంచి బట్టలు తొడిగి, 108 అంబులెన్స్లో జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకొని వెళ్లారు. త్రీ టౌన్ మహేష్ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి వెంకటసుబ్బయ్యకు వైద్యం అందేలా చొరవ తీసుకున్నారు. కామెర్లు పూర్తిగా తగ్గే వరకు ఆస్పత్రిలోనే ఉంచుకోవాలని ఎస్ఐ డాక్టర్లతో చెప్పారు.