ముస్లిం రిజర్వేషన్ల కోసం ఆందోళన | the Muslim protest For reservations | Sakshi
Sakshi News home page

ముస్లిం రిజర్వేషన్ల కోసం ఆందోళన

Apr 28 2016 5:32 PM | Updated on Oct 16 2018 5:59 PM

ముస్లింలకు జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని ఇన్సాఫ్ నాయకులు డిమాండ్ చేశారు.

ముస్లింలకు జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని ఇన్సాఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఇన్సాఫ్ జిల్లా కన్వీనర్ ఎస్.బంగారు భాషా ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ ఆవరణలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కన్వీనర్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు ముస్లింలను ఓటు బ్యాంక్‌గా మార్చి పబ్బం గడుపుకుంటున్నాయని మండిపడ్డారు.

 

ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిని విస్మరించారని ధ్వజమెత్తారు. ముస్లింల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిరుపేద ముస్లింలకు ఆందడం లేదన్నారు. ముస్లింల సంక్షేమం కోసం జస్టిజ్ సచార్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన సిఫారసులను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలో ముస్లిం మైనార్టీలకు ప్రత్యేక సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలన్నారు. వక్ఫ్‌బోర్డు ద్వారా ముస్లిం అభ్యర్తులకు స్కాలర్ షిప్‌లు అందించాలన్నారు. చేతి వృత్తుల ద్వారా పని చేసుకునే కుటుంబాలకు వడ్డీలేని రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలన్నారు.

 

విద్యార్థులు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం, వక్ఫ్‌బోర్డు సంయుక్తంగా పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించి నాణ్యమైన విద్యను అందించాలన్నారు. సబ్సిడీ రుణాలపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ సయ్యద్ ఖాజామొహిద్ధీన్‌కి నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కో-కన్వీనర్ ఇలియాజ్, నాయకులు అల్లీపీరా, ఖాజాహుసేన్, వన్నూర్‌వలి, బాబా ఫకృద్ధీన్, రఫి, చాంద్‌బాషా, మహబూబ్‌బాషా, అక్బర్‌బాషా, మస్తాన్, అయిషా, పర్మాణా, మదార్‌వలి, తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement