టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో రూ. 48 కోట్లు స్వాధీనం
మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట టీడీపీ ఎమ్మెల్యే, రాయచూర్ నవోదయ వైద్య కళాశాల అధ్యక్షుడు ఎస్. రాజేందర్ రెడ్డి నివాసంపై దాడులు జరిపిన ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారులు సుమారు రూ.48 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.
* రాజేందర్రెడ్డి నివాసం, మెడికల్ కళాశాలపై ఐటీ దాడులు
* పలు కీలక రికార్డులు స్వాధీనం
* రాయచూర్లోని నివాసానికి తాళం
రాయచూర్ రూరల్: మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట టీడీపీ ఎమ్మెల్యే, రాయచూర్ నవోదయ వైద్య కళాశాల అధ్యక్షుడు ఎస్. రాజేందర్ రెడ్డి నివాసంపై దాడులు జరిపిన ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారులు సుమారు రూ.48 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఈ దాడులు జరిగాయని తెలిసింది. గురువారం ఉదయం ఐటీ అధికారులు రాయచూర్ (కర్ణాటక)లోని ఎమ్మెల్యే నివాసానికి తాళం వేసి రికార్డులు స్వాధీనం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. రూ.700 కోట్లు విలువ చేసే నవోదయ వైద్య కళాశాలలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు సమాచారం అందడంతో హైదరాబాద్, బెంగళూరు, కలబుర్గిల నుంచి వచ్చిన అధికారుల బృందం ఎమ్మెల్యే నివాసం, వైద్య కళాశాల కార్యాలయంపై దాడులు జరిపి పలు కీలక రికార్డులను స్వాధీనం చేసుకుంది.
నవోదయ వైద్య కళాశాలలో ఆర్థిక నిర్వహణ, వ్యక్తిగత సంపాదన, పన్నుల చెల్లింపు వంటి విషయాలపై సుదీర్ఘంగా తనిఖీ చేశారు. ఈ కళాశాలలో ఎంబీబీఎస్ పట్టా కోసం విద్యార్థులు దాదాపు రూ.కోటి చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు పీజీ, దంత, నర్సింగ్, డీఎడ్, సాంకేతిక విద్యా శాఖ కోర్సులు కూడాఉన్నాయి. ఆ సంస్థలో పని చేస్తున్న శ్రీనివాస్, మాణిక్యరావు, మోహన్రెడ్డిలు పెద్దఎత్తున అక్రమ ఆస్తులు కూడబెట్టారని స్థానికులు అంటున్నారు.అక్రమ సంపాదనతో జీవితం సాగిస్తున్న రాజేందర్ రెడ్డి పన్నులు ఎగవేయడం వల్లనే ఈ దాడులు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. దాడులు చేస్తున్న సమయంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.


