నిజామాబాద్ క్రైం:
జిల్లాలో సీనియర్ ఎస్సైలు నలుగురికి సీఐలుగా పదోన్నతులు రానున్నాయి. టూటౌన్ ఎస్సై బోస్ కిరణ్, 5వ టౌన్ ఎస్సై సైదయ్య, వీఆర్లో ఉన్న ముజుబుర్ ఉర్ రహమాన్, ప్రతాప్లింగంలకు పదోన్నతి రానుంది. దీనికి సంబంధించి రెండ్రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశముందని సమాచారం. వాస్తవానికి నెల క్రితమే వెలువడాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఈలోగా గణేశ్ ఉత్సవాలు రావటంతో నిలిచిపోయిన ఉత్తర్వులు రెండ్రోజుల్లో వెలువడనున్నట్లు తెలిసింది.
నిలిచిపోయిన ఎస్సైల బదిలీలు..
మరోవైపు, జిల్లాలో ఎస్సైల బదిలీలు నిలిచిపోయాయి. నెల క్రితం ఎస్సైలను బదిలీ చేస్తూ ఉత్వర్వులు వెలువడిన సంగతి తెలిసిందే. ఏకంగా 11 మందిని వీఆర్కి బదిలీ చేయడం అప్పట్లో కలకలం రేపింది. అయితే, సదరు ఎస్సైలు ప్రజాప్రతినిధులను కలిసి బదిలీలను నిలిపి వేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఘటనపై ఆగ్రహంతో ఇన్చార్జి డీఐజీ ఇటీవల బోధన్లో పర్యటించిన సమయంలో.. ఆరోపణలు వచ్చిన నలుగురు ఎస్సైలపై చర్యలకు ఉపక్రమించారు. కొత్త జిల్లా ఏర్పాటు నేపథ్యంలో పోలీస్ శాఖలో కూడా విభజన ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో సిబ్బంది విభజన పూర్తయ్యాకే ఎస్సైల బదిలీలు ఉంటాయని పోలీస్ వర్గాలు తెలిపాయి.