
మంత్రి అచ్చెన్నాయుడుపై చంద్రబాబు ఫైర్
విజయవాడలో ఏపీ కేబినెట్ భేటీ వాడివేడిగా కొనసాగింది.
విజయవాడ: విజయవాడలో ఏపీ కేబినెట్ భేటీ వాడివేడిగా సాగింది. సోమవారం 6 గంటల పాటు కొనసాగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో ఇతర శాఖలపై అచ్చెన్నాయుడు ఫిర్యాదులు చేయడంపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందు మీ శాఖను సక్రమంగా నిర్వహించాలంటూ అచ్చెన్నాయుడుకు చురకలు వేశారు.
విజయనగరం జిల్లాలో చంద్రన్న కానుకలను సక్రమంగా పంపిణీ చేయించలేకపోయామంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చంద్రన్న కానుకలను ప్రజలకు చేర్చలేకపోయారంటూ పౌరసరఫరాల శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. రాజధానికి భూములిచ్చిన రైతుల సమస్యలను ఎందుకు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. రైతులు ఆందోళనకు సిద్ధమయ్యే పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. మంత్రులు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో సమస్యలపై దృష్టి సారించాలంటూ సూచించారు.