రోడ్డు దాటుతున్న బాలుడిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తల నుజ్జు నుజ్జయి బాలుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సోమవారం మండలంలో చోటు చేసుకుంది.
టేకులపల్లి: రోడ్డు దాటుతున్న బాలుడిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తల నుజ్జు నుజ్జయి బాలుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సోమవారం మండలంలో చోటు చేసుకుంది. టేకులపల్లి ఎస్ఐ తాటిపాముల సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గోల్యాతండాకు చెందిన బానోతు బిచ్చా, సక్రు దంపతుల కుమారుడైన జంపన్న (10) స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు పొలానికి వెళ్లారు. సోమవారం పాఠశాలకు సెలవు కావడంతో ఆటలాడుకుంటూ రోడ్డు దాటుతున్న క్రమంలో గోదావరిఖని డిపోకు చెందిన భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు బాలుడిని ఢీకొట్టింది. ఘటనలో బాలుడు ఎగిరి బస్సు వెనుక టైరు కింద పడ్డాడు. బాలుడి తల నుజ్జు నుజ్జయి అక్కడికక్కడే మృతి చెందాడు.
తమకు కొడుకు కావాలని ముగ్గురు కుమార్తెలు జన్మించిన తరువాత వేచి ఉన్న వీరికి సమ్మక్క సారలమ్మలను మొక్కుకున్న తరువాత కొడుకు జన్మించడంతో జంపన్న అని పేరుపెట్టుకున్నామని కన్నీరు పెట్టుకుంటూ రోదిస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెండడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఇల్లెందుకు తరలించారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పరిశీ లించి బాలుడి మృతదేహాన్ని సందర్శించి తల్లిదండ్రులను ఓదార్చారు.