‘ఉపాధి’ నిర్లక్ష్యంపై ఆగ్రహం | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ నిర్లక్ష్యంపై ఆగ్రహం

Published Wed, Sep 13 2017 10:02 PM

auctions on 73 members in nregs

73 మందిపై వేటు
10 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు, 63 మంది సీనియర్‌ మేట్స్‌ తొలగింపు


అనంతపురం అగ్రికల్చర్‌: ఉపాధి హామీ పథకం అమలులో నిర్లక్ష్యం వహించిన 73 మందిపై వేటు వేస్తూ గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు బుధవారం కమిషనరేట్‌ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏడాది కాలంలో ఒక గ్రామ పంచాయతీ పరిధిలో కనీసం 10 వేల పనిదినాలు కూడా కల్పించకపోయిన ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సీనియర్‌ మేట్స్‌ను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు డ్వామా కార్యాలయ వర్గాలు తెలిపాయి. అందులో 10 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఉండగా మిగతా 63 మంది సీనియర్‌ మేట్స్‌ ఉన్నారు. జిల్లా అధికారుల ప్రమేయం లేకుండా ఆన్‌లైన్‌ నివేదికల ఆధారంగా వేటు వేసినట్లు చెబుతున్నారు. ఉపాధి హామీ పథకం అమలులో నిర్లక్ష్యం వహించిన 73 మందిపై వేటు వేస్తూ గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

బొమ్మనహాల్, గుత్తి, హిందూపురం, మడకశిర, శింగనమల, తాడిమర్రి, తనకల్లు, ఉరవకొండ మండలాల్లో ఒక్కరు చొప్పున, సోమందేపల్లి మండలంలో ఇద్దరు ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించారు. సీనియర్‌ మేట్స్‌ విషయానికి వస్తే... హిందూపురం మండలంలో ఆరుగురు, మడకశిరలో ఐదు మంది, అనంతపురం, రొద్దం, ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లో నలుగురు చొప్పున, గుంతకల్లు, కనేకల్లు మండలాల్లో ముగ్గురు చొప్పున, బొమ్మనహాళ్‌, గుత్తి, కొత్తచెరువు, లేపాక్షి, పరిగి, పెద్దవడుగూరు, పుట్టపర్తి, శెట్టూరు, సోమందేపల్లి మండలాల్లో ఇద్దరు చొప్పన తొలగించారు. ఇక బ్రహ్మసముద్రం, గోరంట్ల, కుందుర్పి, గార్లదిన్నె, కంబదూరు, నల్లచెరువు, నార్పల, పెద్దపప్పూరు, పెనుకొండ, పుట్లూరు, రాప్తాడు, తాడిపత్రి మండలాల్లో ఒక్కొక్కరిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి.

Advertisement
Advertisement