9వ రోజు 27,58,638 | 9th day 27,58,638 | Sakshi
Sakshi News home page

9వ రోజు 27,58,638

Aug 20 2016 11:11 PM | Updated on Aug 21 2018 11:41 AM

బీచుపల్లి ఘాట్‌లో భక్త జనప్రవాహం - Sakshi

బీచుపల్లి ఘాట్‌లో భక్త జనప్రవాహం

కృష్ణానదీ తీరం..జనతీరమైంది. నదీమతల్లి ఒడిలో తనివితీరా సేదదీరారు. పుష్కరుడి సేవలో భక్తులు తరించిపోయారు. జిల్లాలోని పుష్కరఘాట్లకు శనివారం పోటెత్తారు. పుష్కరాల ముగింపు సమయం సమీపిస్తుండడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఒక్కరోజే 27,58,638 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.

  • కృష్ణమ్మ ఒడిలో తనివీతీరా పుష్కరస్నానాలు
  • గొందిమళ్లలో గవర్నర్‌ నరసింహన్, కేంద్ర మంత్రి దత్తాత్రేయ పుష్కర స్నానం
  • పలు ఘాట్లకు పెరిగిన వీఐపీల తాకిడి
  • నేడు రద్దీ మరింత పెరిగే అవకాశం
  • సోమశిల ఘాట్‌లో తగ్గిన నీటిమట్టం..షవర్లకింద స్నానాలు
  • జాతీయ రహదారి, సోమశిల రోడ్డులో భారీగా ట్రాఫిక్‌ జామ్‌
  •  
    సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ : కృష్ణానదీ తీరం..జనతీరమైంది. నదీమతల్లి ఒడిలో తనివితీరా సేదదీరారు. పుష్కరుడి సేవలో భక్తులు తరించిపోయారు. జిల్లాలోని పుష్కరఘాట్లకు శనివారం పోటెత్తారు. పుష్కరాల ముగింపు సమయం సమీపిస్తుండడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఒక్కరోజే 27,58,638 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పుష్కరాలు ప్రారంభమైనప్పటినుంచి ఇదే రికార్డు. మరోవైపు పుష్కరఘాట్లలో నీటిమట్టం క్రమేణా తగ్గడంతో వరుసగా నాలుగోరోజు జూరాల ఘాట్‌ను మూసివేశారు. అత్యధిక భక్తులతో కిటకిటలాడుతున్న సోమశిలలో సైతం శనివారం పుష్కరఘాట్‌లో నీటిమట్టం తగ్గిపోయింది. దీంతో ఘాట్‌లో పూర్తిగా మునిగి సాన్నం చేయడానికి భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఘాట్‌ పైనున్న షవర్ల ద్వారా పుణ్యస్నానాలు ఆచరించారు. అక్కడినుంచి చాలామంది మంచాలకట్టకు వెళ్లారు. బీచుపల్లి, సోమశిల, రంగాపూర్, గొందిమళ్ల, క్యాతూర్, గుమ్మడం, కొండపాడు, మంచాలకట్ట, నది అగ్రహారం, పస్పుల, కృష్ణ, పంచదేవ్‌పాడు, పాతాళగంగ తదితర పుష్కరఘాట్లలో భక్తులు పెద్ద సంఖ్యలో పుష్కరస్నానం ఆచరించారు. శనివారం ఒక్కరోజే దాదాపు 27,58,638 మంది పుణ్యస్నానం ఆచరించారని అధికారులు తెలిపారు. అలంపూర్‌లోని జోగుళాంబ దేవాలయాన్ని దర్శించడానికి భక్తులు పోటెత్తారు. ఉదయం వేళలో భక్తుల రద్దీ వీఐపీల తాకిడి వల్ల అమ్మవారి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పట్టింది. జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.  
     
    జిల్లాలోని ప్రధాన ఘాట్లలో పుష్కరస్నానాలు
    కృష్ణ 1,01,578
    పస్పుల 60,500
    గొందిమళ్ల 1,58,000
    నదీఅగ్రహారం 1,44,125
    బీచుపల్లి 4,40,000
    రంగాపూర్‌ 6,40,000
    సోమశిల 7,30,000
    పాతాళగంగ 23,860
    (మిగతా వారు ఇతర ఘాట్లలో స్నానమాచరించారు)
     
    వీఐపీలు ఇలా..
    • రాష్ట్ర గవర్నర్‌ ఈఎల్‌ నరసింహన్‌ ఆయన సతీమణి విమల నరసింహన్‌ దంపతులు శనివారం జిల్లాలోని గొందిమళ్ల పుష్కరఘాట్‌లో పుణ్యస్నానమాచరించారు. అనంతరం కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
    • కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ రంగాపూర్, గొందిమళ్ల ఘాట్లను సందర్శించారు. గొందిమళ్ల వీఐపీ ఘాట్‌లో పుష్కరస్నానం ఆచరించి జోగుళాంబను దర్శనం చేసుకున్నారు. 
    • మాజీ మంత్రి మాదాల జానకిరాం, ఆదోల్‌ ఎమ్మెల్యే, సినీనటుడు బాబుమోహన్‌ జోగుళాంబ ఘాట్‌లో పుష్కర స్నానం ఆచరించి జోగుళాంబ దర్శనం చేసుకున్నారు. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రామ్‌లక్ష్మణ్‌ గొందిమళ్లలో పుణ్యస్నానం ఆచరించి జోగుళాంబ దేవాలయాన్ని సందర్శించారు.
    •  రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పిడమర్తి రవి, ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్‌ మంచాలకట్టలో పుణ్యస్నానమాచరించగా, ఐజీపీ మల్లారెడ్డి, వరంగల్‌ రేంజ్‌ డీఐజీ ప్రభాకర్‌రావు సోమశిల పుష్కరఘాట్‌లో స్నానమాచరించారు. 
    • రంగాపూర్‌ పుష్కరఘాట్‌లో మాజీ మంత్రి ముత్యంరెడ్డి, కోరుట్ల శాసనసభ్యుడు విద్యాసాగర్‌రావులు పుణ్యస్నానమాచరించి ప్రత్యేక పూజలు చేశారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ రంగాపూర్‌ ఘాట్‌లోని ఆర్యవైశ్య అన్నదాన శిబిరాన్ని సందర్శించారు. 

    ట్రాఫిక్‌ జామ్‌..

    శనివారం అన్ని పుష్కర ఘాట్లకు భక్తుల రద్దీ పెరగడంతో హైదరాబాద్‌ కర్నూల్‌ జాతీయ రహదారిలోని భూత్పూర్‌ వద్ద ట్రాఫిక్‌ స్తంభించింది. రహదారికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సోమశిలకు భక్తులు క్యూ కట్టడంతో కర్నూల్‌ సోమశిల వద్ద ట్రాఫిక్‌ అంతరాయం కలిగింది. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అడ్డాకుల టోల్‌గేట్‌ వద్ద కూడా వాహనాలు నిలిచిపోయాయి. 

     
    కోటి దాటింది..
    కృష్ణా పుష్కరాలు సందర్భంగా జిల్లాలో పుణ్యస్నానాలు చేసిన భక్తుల సంఖ్య కోటి దాటింది. ఇప్పటి వరకు మొత్తం 1,07,88,575మంది పుష్కరస్నానం చే శారు. తొలి ఎనిమిది రోజుల వరకు 80,19,937 మంది భక్తులు పుష్కరస్నానాలు చేయగా, ఒక్క శనివారమే 27,58,638మంది పుణ్యస్నానాన్ని ఆచరించారు.  
     

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement