వివాహిత దారుణ హత్య
సాక్షి, పలమనేరు(చిత్తూరు) : స్థానిక లాల్బహుదూర్ నగర్లో ఓ వివాహిత దారుణహత్యకు గురైన ఘటన సోమవారం పలమనేరులో సంచలనం సృష్టించింది. పలమనేరు డీఎస్పీ గిరిధర్ కథనం.. మండలంలోని నక్కపల్లెకు చెందిన సుశీల(48)కి ఇద్దరు పిల్లలున్నారు. ఈమె భర్త నారాయణ రెడ్డి గతంలో మృతిచెందారు. ఇలా ఉండగా ఆదివారం రాత్రి సుశీల, మరో వ్యక్తితో కలసి లాల్బహుదూర్ నగర్లో చెంగమ్మ ఇంటికెళ్లారు. ఇల్లు అద్దెకు కావాలని అడిగారు.
అయితే ఇల్లు అద్దెకు లేదని చెప్పడంతో వారిరువురూ రాత్రయిందని, తాము ఈ పూటకి ఇక్కడే తలదాచుకుని ఉదయాన్నే వెళతామని అక్కడి వరండాలో పడుకున్నారు. ఉదయం లేచి చూసేసరికి సుశీల రక్తపు మడుగులో పడి ఉంది. ఈమె తలపై నిందితుడు బండరాయితో మోది హతమార్చినట్లు ఆనవాళ్లు బట్టి తెలుస్తోంది. ఇలా ఉండగా హత్య జరగడానికి ముందే చెంగమ్మ నిద్రించిన ఇంటితలుపుకు గడి పెట్టి∙ఉంది. ఉదయం ఆమె ఇతరులకు ఫోన్చేసి ఇంటిలోంచి బయటకు వచ్చిన తర్వాతే హత్యోదంతం వెలుగుచూసింది.
ఇలా హతురాలు, నిందితుడు ఇద్దరూ గతంలో పట్టణంలోని ఓ క్వార్టర్స్లో ఉంటూ తరచూ గొడవలు పడుతుండేవారని స్థానికులు చెబుతున్నారు. సంఘటన స్థలంలో మద్యం సీసా కూడా ఉన్నట్టు తెలిసింది. సంఘటన స్థలాన్ని పలమనేరు డీఎస్పీ, పట్టణ సీఐ శ్రీధర్ పరిశీలించారు. సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాస్త పొట్టిగా ఉన్న నిందితుడు హిందీ మాట్లాడుతాడని పోలీసులు తెలుసుకున్నారు. అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.