బ్రేకింగ్‌: జంట పేలుళ్ల కేసులో తీర్పు వాయిదా | Verdict In 2007 Hyderabad Twin Bomb Blasts Today | Sakshi
Sakshi News home page

Aug 27 2018 9:51 AM | Updated on Oct 17 2018 5:14 PM

Verdict In 2007 Hyderabad Twin Bomb Blasts Today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని గోకుల్‌చాట్, లుంబినీ పార్కులో 2007లో జరిగిన జంట బాంబు పేలుళ్ల కేసులో తీర్పు వచ్చే నెల నాలుగో తేదీకి వాయిదా పడింది. ఈ కేసులో నేడు (సోమవారం) తీర్పు వెలువడుతుందని భావించినప్పటికీ.. పలు కారణాల వల్ల నాంపల్లిలోని ఎన్‌ఐఏ కోర్టు తీర్పును వచ్చేనెలకు వాయిదా వేసింది. భద్రతా కారణాల రీత్యా చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్‌ఐఏ న్యాయమూర్తి శ్రీనివాసరావు ఎదుట ఐదుగురు నిందితులను హాజరుపర్చారు. భద్రత కారణాల వల్ల నిందితులను కోర్టుకు తీసుకెళ్లడం లేదని, జైలు నుంచే వారిని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జడ్జి ఎదుట ప్రవేశపెడతామని జైలు అధికారులు తెలిపారు.

గోకుల్‌చాట్, లుంబినీ పార్కులో పేలుళ్లతోపాటు దిల్‌సుఖ్‌నగర్‌లో దొరికిన పేలని బాంబులకు సంబంధించి మొత్తం 3 కేసుల విచారణ ఈ నెల 7తో పూర్తయిన సంగతి తెలిసిందే. చర్లపల్లి కేంద్ర కారాగారం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెజిగ్నేటెడ్‌ న్యాయస్థానంలో ఈ విచారణ సాగింది. ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ కేసులో మొత్తం 8 మంది ఉగ్రవాదులను నిందితులుగా పేర్కొనగా అమీర్‌ రజాఖాన్, రియాజ్‌ భత్కల్, ఇక్బాల్‌ భత్కల్‌ పరారీలో ఉన్నారు. మిగిలిన ఐదు గురు నిందితుల (అనీఖ్‌ షఫీఖ్‌ సయీద్, సాదిక్‌ ఇష్రార్‌ షేక్, ఫారూఖ్‌ సర్ఫుద్దీన్‌ తర్ఖా ష్, అక్బర్‌ ఇస్మాయిల్‌ చౌదరి, మహ్మద్‌ తారీఖ్‌ అంజుమ్‌ ఎహసాన్‌)పై విచారణ జరిగింది. సోమవారం తీర్పు వెలువడనుండటంతో పోలీసు విభాగం జైలు వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసింది. ఆక్టోపస్‌ కమాండోలను మోహరించింది. ఈ పేలుళ్లు జరిగి శనివారంతో 11 ఏళ్లు పూర్తయ్యాయి.

  • జంట పేలుళ్ల కేసులను తొలుత నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్‌) బదిలీ చేశారు. పేలుళ్ల ఘటన తర్వాత నాటి ప్రభుత్వం ఉగ్రవాదంపై పోరుకు ఆర్గనైజేషన్‌ ఫర్‌ కౌంటర్‌ టెర్రరిస్ట్‌ ఆపరేషన్స్‌ (ఆక్టోపస్‌) విభాగాన్ని ఏర్పాటు చేసి నిఘా, ఆపరేషన్స్, దర్యాప్తు బాధ్యతలు కల్పిస్తూ పోలీసుస్టేషన్‌ హోదా ఇచ్చింది. దీంతో సిట్‌ నుంచి ఈ 3 కేసులూ ఆక్టోపస్‌కు వెళ్లాయి. దీనిపై ఆక్టోపస్‌ అధికారులు 2009లో 3 అభియోగపత్రాలు దాఖలు చేశారు.
  • ఇది జరిగిన ఏడాదికే ఆక్టోపస్‌ను కమాండో ఫోర్స్‌గా మార్చిన ప్రభుత్వం పోలీ సు స్టేషన్‌ హోదాను ఉగ్రవాద వ్యతిరేక విభాగమైన కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ (సీఐ) సెల్‌కు కట్టబెట్టింది. దీంతో ఈ కేసులు సీఐ సెల్‌కు బదిలీ అయ్యాయి. సీఐ సెల్‌కు భవిష్యత్తులో మరే ఇతర కేసు దర్యాప్తును అప్పగించకూడ దని నాడే నిర్ణయించారు. దీంతో ఆక్టోపస్, సీఐ సెల్‌ వింగ్స్‌ పర్యవేక్షించిన తొలి, ఆఖరి కేసులుగా ఈ మూడే రికార్డులకు ఎక్కాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement