తల్లి, కొడుకు అనుమానాస్పద మృతి

Two died Due To Smoke In Jubli hills - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లిహిల్స్‌లో విషాదం చోటుచేసుకుంది. అనుమానాస్పద పరిస్థితుల్లో తల్లి, కొడుకు మృతి చెందారు. చలి వేస్తుందని ఇంట్లో బొగ్గుల కుంపటి ఏర్పాటు చేసుకున్న తల్లీకుమారుడు ఇళ్లంతా పొగ నిండుకుని ఊపిరాడక మృతి చెందారు.

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలానికి చెందిన సత్యబాబు, అతని భార్య బుచ్చివేణి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 25లోని ప్లాట్‌ నెంబర్‌ 306లో కొద్ది సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. పెథాయ్‌ తుపాను కారణంగా బాగా చలి గాలులు వీస్తుండటంతో వారు ఉండే గదిలో బుచ్చివేణి ఆమె కుమారుడు పద్మరాజు బొగ్గుల కుంపటి ఏర్పాటు పెట్టుకున్నారు. వేడిగా ఉండటానికి తలుపులు, కిటికీలు కూడా మూసేశారు. వారిద్దరూ నిద్రలోకి ఉపక్రమించిన తర్వాత ఇంట్లో పొగ కమ్ముకుని పడుకున్న చోటే మృతి చెందారు. బయటి నుంచి సత్యబాబు ఎంతసేపు తలుపుకొట్టినా తీయకపోవడంతో అనుమానంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా బుచ్చివేణి, పద్మరాజు నిర్జీవంగా పడివున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.

యజమాని ఇంట్లో కుక్క కూడా బుధవారమే చనిపోయింది. ఈ విషయంపై ఏదైనా గొడవ జరిగి వారేమైనా ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో కూడా విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. బొగ్గుల కుంపటి కారణంగానే చనిపోయారా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనేది దర్యాప్తులో తేలుతుందని పోలీసులు స్పష్టం చేశారు.

మృతుడు పద్మరాజు


మృతురాలు బుచ్చివేణి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top