బాలికపై సామూహిక లైంగికదాడి

Molestation on Girl Child in Hyderabad - Sakshi

సినిమా చూపిస్తామని తీసుకెళ్లి అఘాయిత్యం

ఇద్దరు నిందితుల రిమాండ్‌

సైదాబాద్‌: అభం శుభం తెలియని బాలికపై ఇద్దరు యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు.  సినిమా చూపిస్తానని తీసుకెళ్లి పాడుపడిన సాడుబడిన బంగ్లాలో ఒకరి తర్వాత మరొకరు ఘాతుకానికి ఒడిగట్టారు. చిన్నారి అరుపులు విన్న స్థానికులు నిందితులిద్దరినీ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌కు చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చి చంపాపేట పరిధిలోని సింగరేణి కాలనీలో ఉంటోంది.  వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె (11) తుర్కయంజాల్‌లోని హాస్టల్‌లో ఉంటూ 4వ తరగతి చదువుతుంది. మరో బాలిక(06) మూడో తరగతి చదువుతోంది.

బాధితురాలి తండ్రి ఆరేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకోగా, భర్త మరణాన్ని తట్టుకోలేక ఆమె తల్లి మతిస్థిమితం కోల్పోయింది. అదే ప్రాంతానికి చెందిన కేతవత్‌ మోతిలాల్‌ చిత్తు కాగితాలు ఎరుకునే వ్యాపారం చేస్తుండగా, దస్రు ఓ ప్రయివేట్‌ ఆన్‌లైన్‌  కంపెనీలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం సెలవు  రావడంతో  ఇంటికి వచ్చిన బాలిక స్నేహితులతో కలిసి ఆడుకుంటుండటాన్ని గుర్తించిన మోతిలాల్, దస్రులు ఇద్దరు బాలికలను సినిమా చూపిస్తామని బైక్‌పై ఎక్కించుకుని గడ్డిఅన్నారం రోడ్డులోని గంగా థియేటర్‌ వద్దకు తీసుకొచ్చారు. థియేటర్‌ ఎదురుగా ఉంటున్న పాడుబడిన బంగ్లాలోకి బాలిక(11)ను  తీసుకెళ్లి మోతిలాల్‌ మొదట అత్యాచారానికి పాల్పడగా, అనంతరం దస్రు దారుణానికి ఒడిగట్టాడు.  బాధితురాలు నొప్పి భరించలేక కేకలు వేయడంతో గుర్తించిన స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సంఘటనా స్థలంలో ఇద్దరు బాలికలు ఉండగా ఒకరిపై మాత్రమే అత్యాచారం జరిగినట్లు  పోలీసులు తెలిపారు. నిందితులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. బాధితులను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top