చిన్నారిని చిదిమేసిన పాఠశాల బస్సు

Kid dead by school bus - Sakshi - Sakshi

నిజామాబాద్‌ జిల్లా మామిడిపల్లిలో ఘటన

పెర్కిట్‌(ఆర్మూర్‌): నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం మామిడిపల్లిలో శుక్రవారం ఉదయం స్కూల్‌ బస్‌ చక్రాల క్రింద నలిగి సమీర కౌసర్‌ (2) అనే చిన్నారి మృతి చెందింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లికి చెందిన షేక్‌ మహబూబ్‌ జీవనోపాధికోసం ఐదు సంవత్సరాల కిత్రం మామిడిపల్లికి వలస వచ్చారు. మహబూబ్‌కు భార్య ఉమెద్‌ సౌద, కూతురు సమీర కౌసర్‌ ఉంది. మహబూబ్‌ స్థానిక విద్యానగర్‌లో ఉంటూ నూతనంగా నిర్మించే ఇళ్లలో టైల్స్‌ వేస్తూ జీవనం సాగిస్తుంటాడు.

కాగా, వీరి ఇంటి పక్కనే నివాసముంటున్న లక్ష్మీ అనే మహిళ తన పిల్లలను మామిడిపల్లిలోని సేయింట్‌పాల్‌ స్కూల్‌లో చదివిస్తుంటుంది. రోజూ తన పిల్లలను బస్‌లో ఎక్కించడానికి వెళ్తూ సమీర కౌసర్‌ను సైతం వెంట తీసుకెళ్తుంది. తన పిల్లలను బస్‌ ఎక్కించే సమయంలో ఒడిలో ఉన్న సమీరను కిందకు దించింది. అదే సమయంలో చిన్నారి బస్‌ కిందకు వెళ్లింది. బస్‌ డ్రైవర్‌ గమనించకుండా నడపడంతో చిన్నారి చక్రాల కింద పడి నలిగి పోయింది. ఎస్‌హెచ్‌వో సీతారాం, ఎస్‌ఐలు యాకూబ్, గోపి ఘటన స్థలిని పరిశీలించారు. తండ్రి మహబూబ్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. ఏడు నెలల గర్భవతిగా ఉన్న తల్లి ఉమెద్‌ సౌద తన కుమార్తె చనిపోవడంతో తీవ్ర ఆవేదనకు లోనయింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top