కిరాతకం

husband killed wife with Fornication relationship - Sakshi

భర్త చేతిలో భార్య దారుణహత్య

వివాహేతర సంబంధమే కారణం

భార్య మరో యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భర్త కిరాతకుడిగా మారాడు. ఉన్మాదిగా మారి ఆమెపై కత్తితో దాడికి తెగబడ్డాడు. విచక్షణా రహితంగా కత్తితో నరికి భార్యను హత్య చేసిన సంఘటన తిరువళ్లూరు సమీపంలోని పున్నపాక్కం వద్ద మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం కలిగించింది.

తిరువళ్లూరు: వివాహేతర సంబంధం మహిళ ప్రాణాలను బలిగొంది. భర్త కాలయముడై ఆమెను హత్య చేశాడు. వివరాలు... తిరువళ్లూరు జిల్లా ఆట్రంబాక్కం గ్రామానికి చెందిన నాగరాజ్‌కు, బీమంతోపు గ్రామానికి చెందిన నందినితో ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ముగ్గురు అడపిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసైన నాగరాజ్‌కు, నందినికి మధ్య తరచూ ఘర్షణ జరిగేది. నాగరాజ్‌ తీరుతో విసుగు చెందిన నందిని, భర్తకు దూరంగా తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఈ స్థితిలో ఆమెకు పొరుగు గ్రామానికి చెందిన యువకుడితో వివాహేతర సంబధం ఏర్పడినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం నందిని తిరువళ్లూరులోని ప్రయివేటు నగల దుకాణంలో పని చేస్తోంది. మంగళవారం రాత్రి యథావిధిగా విధులు ముగించుకుని రాత్రి 10.20 గంటలకు ప్రియుడితో కలిసి బైక్‌పై ఇంటికి  బయలుదేరింది. పున్నపాక్కం సమీపంలో వస్తుండగా నాగరాజ్‌ వారిని అడ్డుకుని భార్యపై విచక్షణా రహితంగా కత్తితో దాడిచేశాడు. భయాందోళన చెందిన ప్రియుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న నందినిని అటువైపు వెళుతున్న వారు తిరువళ్లూరు వైద్యశాలకు తరలించారు. అక్కడ చిక్సిత ఫలించక నందిని బుధవారం ఉదయం నాలుగు గంటలకు మృతి చెందింది. నందిని హత్యపై కేసు నమోదు చేసుకున్న తిరువళ్లూరు తాలుకా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నాగరాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. భార్య ప్రవర్తన నచ్చకపోవడంతోనే హత్య చేసినట్టు నాగరాజ్‌ పోలీసులు ఎదుట నేరం అంగీకరించాడు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top