పరువు హత్య   

Daughter Killed By Her Parents And Grand Mother In Duddepoodi - Sakshi

కన్న కూతురిని తండ్రి, మారు తల్లి చంపేశారు

ప్రేమ వ్యవహారమే కారణం

వేంసూరు : తన కన్న కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే  కసాయిగా మారి, తన రెండోభార్యతో కలిసి చంపేశాడు. మండలంలోని దుద్దెపూడి గ్రామంలో ఇది జరిగింది. వేంసూరు పోలీస్‌ స్టేషన్‌లో గురువారం విలేకరుల సమావేశంలో సత్తుపల్లి రూరల్‌ సీఐ మడతా రమేష్‌ తెలిపిన వివరాలు...

దుద్దెపూడి గ్రామానికి చెందిన కోటమర్తి రాంబాబు కుమార్తె దీపిక(18), సత్తుపల్లిలోని ప్రైవేట్‌ కళాశాలో డిగ్రీ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. ఆమె తండ్రికి ఈ విషయం తెలిసింది.

పరువు పోతుందన్న భయంతో తండ్రి రాంబాబు, సవతి తల్లి లక్ష్మి, నాయనమ్మ చిట్టెమ్మ కలిసి ఈ నెల 7న దీపిక మెడకు చున్నీ బిగించి హత్య చేశారు. దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నోట్లో పురుగు మందు పోశారు.

సిరంజితో కొంత మందును శరీరంలోకి ఎక్కించారు. దీపిక మేనమామ సాధు కృష్ణరాజు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికలో.. దీపికది హత్యేనని వెల్లడైంది. నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టుకు అప్పగించారు. సమావేశంలో ఎస్సై వెంకన్న, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top