టాటా కూడా టాటా చెప్పేసినట్టేనా? | Tata Group unlikely to bid for Air India as terms too onerous: sources | Sakshi
Sakshi News home page

టాటా కూడా టాటా చెప్పేసినట్టేనా?

Apr 11 2018 4:14 PM | Updated on Apr 11 2018 4:31 PM

Tata Group unlikely to bid for Air India as terms too onerous: sources - Sakshi

సాక్షి,ముంబై: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విక్రయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి వరుసగా ఎదురు దెబ్బలు తప్పడం లేదు.  అప్పుల కుప్ప  కొనుగోలు రేసులో ఒక్కొక్కరు తప్పుకోవడం  ఇపుడు  చర్చనీయాంశంగా మారింది.  అప్పుల భారం తగ్గించేందుకు ప్రైవేటీకరణ బాట పట్టినా.. కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు.  డీకాపిటలైజేషన్‌ బాటలో ఎయిరిండియాలో ప్రభుత్వ  76 శాతం వాటా  కొనుగోలుకు తొలుత కొన్ని సంస్థలు ఆసక్తి చూపించినా.. ఆ తర్వాత వెనక్కి తగ్గుతున్నాయి. ఇప్పటికే ఇండిగో, జెట్‌ ఎయిర్‌వేస్‌ పక్కకు  తప్పుకోగా  తాజాగా ఈ  రేసులో ప్రధానంగా నిలబడిన టాటా గ్రూప్‌ కూడా  బాటలో  పయనించనున్నట్లు సమాచారం.

ఎయిరిండియా వాటా కొనుగోలుకు దూరంగా ఉండాలని టాటా గ్రూప్‌ భావిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధమున్న కొందరు వ్యక్తుల ద్వారా తెలుస్తోంది. కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం విధించిన నిబంధనలే ఇందుకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎయిరిండియాలో వాటా కొనుగోలు చేసినవారు  ప్రభుత్వ వాటా వున్నంత కాలం తమ సొంత వ్యాపారాలతో దీన్ని విలీనం చేయరాదన్న ప్రభుత్వ నిబంధన ఇపుడు  సంస్థలకు కొరకరాని కొయ్యగా మారింది.  అంతేకాదు ఉద్యోగులను తగ్గించకూడదంటూ కొన్ని  ఇతర కీలక  నిబంధనలు విధించింది ప్రభుత్వం. దీంతో తొలుత వాటా కొనేందుకు టాటా గ్రూప్ ఆసక్తి కనబర్చినా.. తాజా నిబంధనల నేపథ్యంలో పునరాలోచనలో పడింది.   ఎయిరిండియాపై పూర్తి నియంత్రణ కోరుకుంటున్న టాటా గ్రూపు ఇన్ని నిబంధనల మధ్య ఎయిరిండియాను నడపగలమా? లేదా అన్న సందిగ్ధతలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు  దీనిపై టాటా గ్రూప్‌ స్పందించడానికి నిరాకరించింది. కాగా  ప్రైవేటీకరణ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత   ఎయిర్‌ ఇండియాపై దృష్టి  పెడతామని గత ఏడాది అక్టోబర్‌లో టాటా గ్రూపు చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఒక టీవీ ఇంటర్వ్యూలో ప్రకటించడం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement