జెట్‌ ఎయిర్‌వేస్‌పై దివాలా పిటీషన్‌? | SBI mulling insolvency route via NCLT to recover Jet Airways loan | Sakshi
Sakshi News home page

జెట్‌ ఎయిర్‌వేస్‌పై దివాలా పిటీషన్‌?

Feb 25 2019 1:07 AM | Updated on Feb 25 2019 1:07 AM

SBI mulling insolvency route via NCLT to recover Jet Airways loan - Sakshi

న్యూఢిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌పై దివాలా పిటీషన్‌ దాఖలు చేయాలని ఎస్‌బీఐ యోచిస్తోందని సమాచారం. నిర్వహణ కార్యకలాపాలకే నిధుల్లేక జెట్‌ ఎయిర్‌వేస్‌ అల్లాడుతున్న విషయం తెలిసిందే. రుణ పునర్వ్యవస్థీకరణకు, రుణాలను ఈక్విటీగా మార్చడానికి తదితర  మరికొన్న ప్రతిపాదనలకు వాటాదారులు ఈ నెల 21న జరిగిన అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎమ్‌)ఇటీవలే ఆమోదం తెలిపారు. మరోవైపు ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంక్‌ల కన్సార్షియమ్‌ జెట్‌ ఎయిర్‌వేస్‌కు రూ.500 కోట్ల మేర నిధులను కూడా మంజూరు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది(ఈ విషయమై తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది). ఈ నేపథ్యంలో జెట్‌ ఎయిర్‌వేస్‌పై నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ)లో  దివాలా పిటిషన్‌ విషయమై ఎస్‌బీఐ కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. అయితే  దీనిపై ఎస్‌బీఐ గానీ, జెట్‌ ఎయిర్‌వేస్‌ కానీ అధికారికంగా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.  

కాగా ఈ నెల 21న జరిగిన ఈజీఎమ్‌లో వివిధ ప్రతిపాదనలపై ఓటింగ్‌కు ఇతిహాద్‌ కంపెనీ దూరంగా ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌లో ఇతిహాద్‌ ఎయిర్‌వేస్‌కు 24% వాటా ఉంది. ఎస్‌బీఐ, నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌(ఎన్‌ఐఐఎఫ్‌)ల నుంచి మరిన్ని అదనపు నిధులు, ఈక్విటీ కేటాయింపు తదితర అంశాలపై మరింత స్పష్టత కోసం జెట్‌ ఎయిర్‌వేస్‌ వేచి చూస్తోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌లో ఎస్‌బీఐ, ఎన్‌ఐఐఎఫ్‌లు 51% వాటా తీసుకోవాలని, దీని కోసం ఈ రెండు సంస్థలు రూ.2,200 కోట్లు పెట్టుబడులు పెట్టాలని ఇతిహాద్‌ కోరుకుంటోందని ఆ వర్గాలు వెల్లడించా యి.  తాము ఇచ్చిన రుణాలను రాబట్టుకునేందుకు బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు రుణాలిచ్చిన కంపెనీపై ఎన్‌సీఎల్‌టీలో  దివాలా పిటిషన్‌ను దాఖలు చేస్తా యి. దీనికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపితే సదరు సంస్థపై దివాలా ప్రక్రియ ప్రారంభమవుతుంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement