లాభాలే లాభాలు : ఇక జియో కస్టమర్లకు పండగే!

Reliance Industries Reports Record Profit Of Rs 9459 Crore In April-June - Sakshi

ముంబై : ఆయిల్‌ నుంచి టెలికాం వరకు వ్యాపారాల్లో తిరుగు లేకుండా దూసుకుపోతున్న రిలయన్స్‌  ఇండస్ట్రీస్‌ రికార్డు లాభాల పంట పండించింది. నేడు ప్రకటించిన తొలి క్వార్టర్‌ ఫలితాల్లో నికర లాభాలు రూ.9,459 కోట్లగా రికార్డు చేసింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో ఈ లాభాలు రూ.9,108 కోట్లగా ఉన్నాయి. నిర్వహణ నుంచి కంపెనీకి వచ్చిన కన్సాలిడేటెడ్‌ రెవెన్యూలు ఏడాది ఏడాదికి 56.5 శాతం పెరిగి, రూ.1.41 లక్షల కోట్లగా నమోదైనట్టు వెల్లడించింది. ఈ రెవెన్యూలు గతేడాది ఇదే సమయంలో రూ.90,537 కోట్లగా ఉన్నాయని కంపెనీ తెలిపింది.   

టెలికాం మార్కెట్లో సంచలనం సృష్టించిన రిలయన్స్‌ జియో వరుసగా మూడు క్వార్టర్లు నికర లాభాలను ఆర్జించినట్టు కంపెనీ ప్రకటించింది. దీంతో కస్టమర్లకు మరికొంత కాలం పాటు కూడా టారిఫ్‌ ధరలు తగ్గనున్నట్టు తెలిసింది. మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవడానికి టారిఫ్‌లను తగ్గిస్తామని కంపెనీ తెలిపింది. ఈ క్వార్టర్‌ ముగింపు నాటికి రిలయన్స్‌ జియో రూ.612 కోట్ల నికర లాభాలను నమోదు చేసినట్టు ప్రకటించింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో ఈ లాభాలు రూ.510 కోట్లగా ఉన్నాయి. 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఫలితాల్లో ముఖ్య విషయాలు..

  • కంపెనీ గ్రాస్‌ రెవెన్యూ మార్జిన్లు ఒక్కో బ్యారల్‌కు 10.5 డాలర్లగా నమోదయ్యాయి. గతేడాది ఇదే క్వార్టర్‌లో ఒక్కో బ్యారల్‌ గ్రాస్‌ రెవెన్యూ మార్జిన్‌ 11.90 డాలర్లుగా ఉంది.
  • రిఫైనింగ్‌, మార్కెటింగ్‌ సెగ్మెంట్‌లో జూన్‌ క్వార్టర్‌ రెవెన్యూలు ఏడాది ఏడాదికి 42.9 శాతం పెరిగి రూ.95,646 కోట్లగా ఉన్నాయి.
  • రిలయన్స్‌ జియో ఆర్పూ(యావరేజ్‌ రెవెన్యూ పర్‌ యూజర్‌) రూ.134.50కి పడిపోయింది.
  • జియో ఈబీఐటీడీఏలు క్వార్టర్‌ క్వార్టర్‌కు 16.80 శాతం పెరిగి రూ.3,147 కోట్లకు ఎగిశాయి.
  • జియో ఈబీఐటీడీఏ మార్జిన్లు క్వార్టర్‌ క్వార్టర్‌ బేసిస్‌లో 37.80 శాతం నుంచి 38.80 శాతం పెరిగాయి.    
  • సబ్‌స్క్రైబర్‌ వృద్ధిలో జియో ట్రెండ్‌ కొనసాగుతోంది. నెట్‌ అడిక్షన్‌ 28.7 మిలియన్లగా నమోదైంది.
  • కంపెనీ కమర్షియల్‌గా సర్వీసులు లాంచ్‌ చేసినప్పటి నుంచి ఇదే అత్యధిక అడిక్షన్‌.

మా వ్యాపారాల పోర్టుఫోలియోలో కార్యాచరణ శ్రేష్టత ద్వారా బలమైన డెలివరీని అందించేందుకు దృష్టి సారిస్తూనే ఉంటాం. మా పెట్రోకెమికల్స్‌ వ్యాపారాలు రికార్డు ఈబీఐటీడీఏలను జనరేట్‌ చేశాయి. కాలానుగుణ బలహీనత ఉన్నప్పటికీ, రిఫైనింగ్‌ వ్యాపారాల ప్రదర్శన స్థిరంగా ఉంది. ఆయిల్‌ ఉత్పత్తుల్లో గ్లోబల్‌గా డిమాండ్‌ కొనసాగింది. మా రిఫైనింగ్‌ వ్యాపారాల్లో, సముద్ర ఇంధనాల్లో పర్యావరణానికి అనుకూలంగా కఠినమైన చర్యలను అమలు చేశాం - రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top