బిట్‌కాయిన్‌ కొనుగోలుదారులకు ఐటీ షాక్‌ | I-T will tax bitcoin trade -has issued a few lakh notices  | Sakshi
Sakshi News home page

బిట్‌కాయిన్‌ కొనుగోలుదారులకు ఐటీ షాక్‌

Feb 2 2018 4:46 PM | Updated on Sep 27 2018 4:47 PM

I-T will tax bitcoin trade -has issued a few lakh notices  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బిట్‌కాయిన్స్‌లో పెట్టుబడులు పెట్టిన వారికి లక్షల సంఖ్యలో నోటీసులు జారీ చేశామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చీఫ్‌ వెల్లడించారు. బిట్‌కాయిన్స్‌లో పెట్టుబడులు పెట్టిన వారి నుంచి పన్నులు రాబట్టే చర్యలు చేపడుతున్నామని చెప్పారు. బిట్‌కాయిన్స్‌ ద్వారా లాభాలు ఆర్జించిన వారు వాటిపై అడ్వాన్స్‌ ట్యాక్స్‌లు చెల్లించలేదనే విషయం పన్ను అధికారుల దృష్టికి వచ్చిందని సీబీడీటీ ఛైర్మన్‌ సుశీల్‌ చంద్ర పేర్కొన్నారు. గతంలో మరికొందరు ఈ తరహా పెట్టుబడుల గురించి తమ పన్నురిటన్స్‌లో పొందుపరచలేదని అన్నారు. గత ఏడాది డిసెంబర్‌లో బిట్‌కాయిన్స్‌ లావాదేవీలు నిర్వహిస్తున్న ఎక్సే‍్ఛంజ్‌లపై దేశవ్యాప్తంగా సర్వేలు నిర్వహించామని చెప్పారు.

బిట్‌కాయిన్స్‌లో ఇన్వెస్ట్‌ చేసి వాటి వివరాలను వెల్లడించని వారి వద్ద ఆయా పెట్టుబడులపై వారందరి నుంచీ పన్నులు రాబడతామని, పన్నులు చెల్లించేందుకు పలువురు ఇన్వెస్టర్లు అంగీకరించారని తెలిపారు. కొన్ని లక్షల మందికి ఈ నోటీసులు జారీ అయ్యాయని తెలిపారు. ఇక ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ బడ్జెట్‌ ప్రసంగంలో బిట్‌కాయిన్స్‌పై ఉక్కుపాదం మోపుతామని వెల్లడించిన విషయం తెలిసిందే. బిట్‌కాయిన్స్‌ సహా క్రిప్టోకరెన్సీలన్నీ చట్టవిరుద్ధమనీ, వాటి వాడకాన్ని నిలిపివేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.మరోవైపు బిట్‌కాయిన్స్‌ చట్టవిరుద్ధమైనవని ఆర్థిక మంత్రి ప్రకటించిన క్రమంలో భారత్‌లో బిట్‌కాయిన్‌ విలువ భారీగా పతనమైంది. గతంలో రూ 6,44,042గా ఉన్న బిట్‌కాయిన్‌ విలువ శుక్రవారం మధ్యాహ్నం రూ 5,44,735కు పడిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement