
సాక్షి, న్యూఢిల్లీ : బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో, బంగారానికి డిమాండ్ పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.325 మేర పెరిగి రూ.30,775గా నమోదైంది. అంతేకాక అంతర్జాతీయంగా కూడా బంగారానికి బలమైన సంకేతాలు వీస్తున్నాయి. సిల్వర్ కూడా రికవరీ అయింది. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి డిమాండ్ పెరుగడంతో, వెండి ధరలు రూ.600 మేర పెరిగి రూ.41వేల మార్కును దాటాయి.
శనివారం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.41,150గా రికార్డైంది. ప్రస్తుతం దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో, స్థానిక జువెల్లర్స్ నుంచి బంగారానికి భారీగా డిమాండ్ ఏర్పడింది. ఈ డిమాండ్తో దేశీయంగా బంగారం ధరలు పైకి ఎగిశాయి. అంతేకాక అంతర్జాతీయంగా డాలర్కు సెంటిమెంట్ బలహీనంగా ఉంది. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు రూ.325 చొప్పున పెరిగి రూ.30,775గా, రూ.30,625గా నమోదయ్యాయి. గత రెండు రోజులుగా ఈ మెటల్ రూ.175 నష్టపోయింది.