ఛత్తీస్ గఢ్‌ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు

Cops, Naxals exchange fire in Chhattisgarh - Sakshi

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. చర్ల మండలం తిప్పాపురం సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో శనివారం సుమారు గంటసేపు ఎదురు కాల్పులు కొనసాగాయి. ఈ నెల 5వ తేదీన మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు సరిహద్దుల్లో కూంబింగ్‌ నిర్వహిస్తుండగా, మావోలు తారసపడడం తో ఎదురు కాల్పులు మొదలైనట్లు తెలుస్తుంది. ఈ ఎదురుకాల్పుల్లో ఓ జవాను తీవ్రంగా గాయపడగా, ఓ మావోయిస్టు మృతి చెందినట్లు సమాచారం. అయితే అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

కాగా మావోయిస్టుల నిర్మూలన పేరుతో పాలకులు ప్రజలపై చేస్తున్న ఫాసిస్టు నిర్బంధానికి వ్యతిరేకంగా దండకారణ్యం, తెలంగాణలో ఈనెల 5న బంద్‌ పాటించాలని సీపీఐ(మావోయిస్టు) దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు స్పెషల్‌ జోనల్‌ కమిటీ, రాష్ట్ర అధికార ప్రతినిధులు వికల్స్, జగన్‌ పేరిట బుధవారం లేఖ విడుదలైన విషయం తెలిసిందే.

Read latest Bhadradri News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top