బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల్లో హామీలు గుప్పించి... చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక కాంట్రాక్ట్ ఉద్యోగులను ..
హైదరాబాద్ : బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల్లో హామీలు గుప్పించి... చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సర్వేశ్వరరావు, రాజన్నదొర మండిపడ్డారు. వైఎస్ఆర్ హయాంలో ఉద్యోగాలు పొందారని... వారిని రెగ్యులర్ చేయకపోవడం చాలా దారుణమన్నారు.
అసెంబ్లీ పది నిమిషాల పాటు వాయిదా అనంతరం వారు మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ హయాంలో ఉద్యోగాలు పొందారని వారిని క్రమబద్దీకరించకపోవటం దుర్మార్గం అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారేనని ఎమ్మెల్యేలు తెలిపారు. అంగన్వాడీ, ఐకేపీ ఉద్యోగుల సమస్యలు, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాల్సిందేనని డిమాండ్ చేశారు.