త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలతో సంబంధం ఉన్న అధికారులు, ఉద్యోగులను సొంత జిల్లాల నుంచి ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను ఆదేశించింది.
సాక్షి, హైదరాబాద్: త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలతో సంబంధం ఉన్న అధికారులు, ఉద్యోగులను సొంత జిల్లాల నుంచి ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను ఆదేశించింది. ఈ మేరకు కమిషన్ ముఖ్యకార్యదర్శి కె.అజయ్కుమార్ ఓ లేఖ రాశారు. మూడేళ్ల పాటు ఒకే చోట పనిచేస్తున్న వారిని కూడా బదిలీ చేయాలని స్పష్టం చేశారు.
31-05-2014 నాటికి మూడేళ్ల పాటు ఒకేచోట పనిచేసి ఉంటే అక్కడి నుంచి బదిలీ చేయాలని పేర్కొన్నారు. జిల్లా ఎన్నికల అధికారులు, డిప్యూటీ ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, అదనపు జిల్లా మెజిస్ట్రేట్, డిప్యూటీ కలెక్టర్లు, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్లు, తహశీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులతో పాటు ఐజీలు, డీఐజీలు, రాష్ట్ర ఆర్మ్డ్ కమాండెంట్లు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు, సబ్ డివిజనల్ పోలీసు అధికారి, ఎస్ఐ ర్యాంకు అధికారులతో పాటు ఎన్నికల విధులు నిర్వహించే పోలీసు సిబ్బందికి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఈ బదిలీల ప్రక్రియను వచ్చే నెల 15లోగా పూర్తి చేసి నివేదిక పంపాలన్నారు.
సార్వత్రిక ఎన్నికలకు సిద్ధంకండి: భన్వర్లాల్
సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావాలని, ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యేలా భద్రతా, బందోబస్తు ప్రణాళికలను రూపొందించుకోవాలని అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ ఆదేశించారు. ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో భన్వర్లాల్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.