భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటన ఆదివారం కొత్తపల్లి మండలం కొండెవరం శివారు
అనుమానంతో భార్యపై దాడి
Sep 30 2013 12:55 AM | Updated on Jul 27 2018 2:18 PM
కొత్తపల్లి, న్యూస్లైన్ : భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటన ఆదివారం కొత్తపల్లి మండలం కొండెవరం శివారు పాటి గ్రామంలో జరిగింది. స్థానికులు, బాధితురాలి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొండెవరం శివారు కాశీవారి పాకలులో కూలీ మేడిశెట్టి లోవరాజు తన భార్య దుర్గతో ఉంటున్నాడు. ఆమె అమ్మమ్మ, తాతయ్యలు పాటి గ్రామంలో నివసిస్తున్నారు. రెండు రోజుల క్రితం దుర్గ అమ్మమ్మ చనిపోయింది. ఈ క్రమంలో తాతయ్యను పరామర్శించేందుకు దుర్గ, లోవరాజులు పాటి గ్రామానికి ఆదివారం వచ్చారు.
మధ్యాహ్నం భోజనం తర్వాత దుర్గ ఇంట్లో పడుకుంది. కొంతకాలం నుంచి దుర్గ నడవడికపై అనుమానం పెంచుకున్న లోవరాజు మద్యంమత్తులో కత్తితో ఆమెపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన దుర్గ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు, బంధువులు అక్కడకు చేరుకున్నారు. గాయపడ్డ దుర్గను చికిత్స కోసం పిఠాపురంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఉన్న లోవరాజును సమీపంలోని విద్యుత్ స్తంభానికి కట్టి, దేహశుద్ధి చేసి విడిచిపెట్టారు. ఈ సంఘటనపై కొత్తపల్లి సీఐ ఎన్.కొండయ్యను అడగ్గా, విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. అయితే తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.
Advertisement


