నూతన గవర్నర్‌తో విజయసాయిరెడ్డి భేటీ | Sakshi
Sakshi News home page

నూతన గవర్నర్‌తో విజయసాయిరెడ్డి భేటీ

Published Sat, Jul 20 2019 11:57 AM

Vijayasai Reddy Meets AP Governor Bishwa Bhushan Hari Chandran - Sakshi

సాక్షి, భువనేశ్వర్‌: ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ్‌ హరిచందర్‌తో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి భేటీ అయ్యారు. భువనేశ్వర్‌లోని విశ్వభూషణ్‌ నివాసానికెళ్లిన ఆయన గవర్నర్‌గా నియమితులైనందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఏపీ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, తిరుమల వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఇద్దరూ కలిసి కాసేపు ముచ్చటించారు.


ప్రమాణ స్వీకార ఏర్పాట్లు షురూ..
ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ్‌ హరిచందర్‌ ఈనెల 24న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాజ్‌భవన్‌ వద్ద ఏర్పాట్లును ప్రారంభించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శి అర్పీ సిసోడియా, గవర్నర్ కార్యదర్శి ఎంకే మీనా శనివారం రాజ్‌భవన్ వద్దకు చేరుకున్నారు. పనులు, ప్రమాణ స్వీకార ఏర్పాట్లు పరిశీలించి.. వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈ నెల 23వ తేదీన ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ నుంచి విమానంలో బయలుదేరి తిరుపతికి చేరుకుంటారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం విజయవాడకు వస్తారు. కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు. 24వ తేదీన ఉదయం 11:30 గంటలకు ఏపీ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేస్తారు.


Advertisement
Advertisement