సమస్యలున్నందునే ఆర్‌సీఈపీలో చేరలేదు | Vijay Sai Reddy Question To Piyush Goyal In Rajya Sabha | Sakshi
Sakshi News home page

సమస్యలున్నందునే ఆర్‌సీఈపీలో చేరలేదు

Dec 14 2019 7:28 AM | Updated on Dec 14 2019 7:28 AM

Vijay Sai Reddy Question To Piyush Goyal In Rajya Sabha - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్‌సీఈపీ) మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా రూపుదిద్దుకోలేదని, ఈ ఏడాది బ్యాంకాక్‌లో జరిగిన ఆర్‌సీఈపీ తృతీయ సదస్సులో లేవనెత్తిన పలు అంశాలకు పరిష్కారం చూపనందునే భాగస్వామ్య ఒప్పందంలో భారత్‌ చేరలేదని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. రాజ్య సభలో శుక్రవారం వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీనేత వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా జవాబిచ్చారు. దేశీయ రంగాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఆర్‌సీఈపీలో వివిధ అంశాలపై సమతుల్యత సాధించే దిశగా ప్రయత్నాలు జరిగినట్లు తెలిపారు.

హాల్‌మార్కింగ్‌తప్పనిసరి
ఇకపై 14, 18, 22 క్యారెట్ల బంగారు నగలపై హాల్‌ మార్కింగ్‌ తప్పనిసరి చేయనున్నట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రావ్‌ సాహెబ్‌ దాదారావ్‌ దాన్వే తెలిపారు. రాజ్యసభలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా అక్టోబర్‌ 31 నాటికి బీఐఎస్‌ గుర్తింపుతో 877 హాల్‌ మార్కింగ్‌ కేంద్రాలు పనిచేస్తున్నాయని, ఇలాంటివి ఏపీలో 43, తెలంగాణలో 29 ఉన్నట్టు వివరించారు.

దిశ చట్టం తరహాలో దేశవ్యాప్త  చట్టం తేవాలి
దిశ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించిన తీరుకు మహిళా లోకం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని వైఎస్సార్‌సీపీ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఆమె పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఏపీలో తెచ్చి న చట్టం తరహాలో దేశవ్యాప్తంగా అమ లయ్యేలా చట్టం తేవాల్సిన అవసరం ఉందని ప్రధానికి, హోంమంత్రికి లేఖ రాస్తామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement