జిల్లా పరిషత్ పాలక వర్గ ఎన్నిక శనివారం కడపజిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణంలోని సమావేశ మందిరంలో జరగనుంది.
కడప రూరల్ : జిల్లా పరిషత్ పాలక వర్గ ఎన్నిక శనివారం కడపజిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణంలోని సమావేశ మందిరంలో జరగనుంది. జెడ్పీ చైర్మన్గా కోడూరు రవి (ఎర్రగుంట్ల జెడ్పీటీసీ), వైస్ చైర్మన్గా ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి (ఒంటిమిట్ట జెడ్పీటీసీ)లను బలపరచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు విప్ జారీ చేశారు. కాగా జిల్లా పరిషత్ పాలకవర్గ ఎన్నికలకు సంబంధించి జిల్లా అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉదయం 10 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.
మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, అర్హత పొందిన నామినేషన్ల జాబితా విడుదల ఉంటుంది. మధ్యాహ్నం ఒంటిగంటలోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. అనంతరం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి కొత్తగా ఎన్నికైన సభ్యులచే ప్రమాణ స్వీకారం, కో అప్టెడ్ సభ్యుల ఎన్నిక జరుగుతుంది. ఎన్నిక పూర్తయిన వెంటనే అధికారులు ఫలితాలను ప్రకటిస్తారు. సాయంత్రం 3 గంటలకు జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికను నిర్వహిస్తారు. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా కలెక్టర్ వ్యవహరిస్తారు.