‘మన్మథ’ నామ సంవత్సరంలో ప్రభుత్వ పాలకులు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రముఖ పంచాంగకర్త మారేపల్లి రామచంద్రశాస్త్రి పేర్కొన్నారు.
- ‘మన్మథ’ పంచాంగ శ్రవణంలో రామచంద్రశాస్త్రి వెల్లడి
- వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు
- పోరుబాటలో ప్రజలు.. జనం పక్షాన విపక్షం
- రాష్ట్రంలో కొత్త పార్టీలకు అవకాశం లేదు
- యువతకు బాధ్యతలు అప్పగించేందుకు జనం మొగ్గు
సాక్షి, హైదరాబాద్: ‘మన్మథ’ నామ సంవత్సరంలో ప్రభుత్వ పాలకులు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రముఖ పంచాంగకర్త మారేపల్లి రామచంద్రశాస్త్రి పేర్కొన్నారు. రాజు స్థానంలోకి శని, మంత్రి స్థానంలోకి కుజుడు చేరడమే అందుకు కారణమని చెప్పారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పంచాంగ శ్రవణం చేశారు.
పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గట్టిగా పోరాటాలు చేస్తేనే దేన్నైనా సాధించగలమనే మనస్తత్వంతో ప్రజలుంటారని, ప్రతిపక్షం కూడా జనం పక్షాన నిలబడుతుందని పంచాంగ కర్త పేర్కొన్నారు. వీరిద్దరూ ఏకం కావడానికి ముందే ప్రభుత్వం మేలుకుని ప్రజా సమస్యలను నెరవేరిస్తే చాలా మంచిదన్నారు. ‘ఈ సంవత్సరం అంతా చాలా వివాదాలొస్తాయి. రాజకీయంగా ఇంకా రసవత్తరంగా ఉంటుంది.
పాలించే వారికిది ఛాలెంజింగ్ కాలం. ప్రతిపక్షం అంటే అన్ని చోట్లా ఉన్నట్లుగా ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నట్లుగా ఇక్కడ ఉండదు. ఆంధ్రప్రదేశ్లో మొన్నటి ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య చాలా స్వల్ప తేడా ఉంది. మన్మథ నామ సంవత్సరంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం పొందుతుంది. గ్రామీణ స్థాయి నుంచీ పార్టీ పటిష్టం అవుతుంది. పార్టీకి బ్రహ్మాండమైన ఉజ్జ్వలమైన భవిష్యత్తు ఉంది. ఎన్టీఆర్, వైఎస్ఆర్ తరువాత అంతటి ప్రజాదరణ వైఎస్ జగన్మోహన్రెడ్డికి లభిస్తుంది.
ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త పార్టీకి అవకాశమే లేదు. కొత్త పార్టీ పెట్టాలనుకునే వారు మరో రాష్ట్రానికి వెళితే మంచిది. తెలంగాణలో కూడా వైఎస్సార్సీపీకి మంచి భవిష్యత్తు ఉంది. ప్రపంచంలో తెలుగువారున్న చోట్లల్లా వైఎస్ అభిమానులున్నారు. వైఎస్సార్ అభిమానులు ఉన్న చోట్లల్లా వైఎస్సార్సీపీ బలపడుతుంది. ఈ ఏడాది యువతకు భవిత బాగుంటుంది. యువతకు బాధ్యతలు అప్పగించడానికే ప్రజలు ఇష్టపడతారు. ‘ఫ్యాన్’కు ‘ఫ్యాన్స్’ ఈ ఏడాదిలో పెరుగుతారు. పార్టీ శ్రేణులు ఏ సంకల్పంతో ఉన్నారో దాన్ని నెరవేర్చే భారాన్ని ప్రజలే తమపై వేసుకుంటారు.
పార్టీలు మేనిఫెస్టోలోని అంశాలను మర్చిపోతే ప్రజలు, మీడియా, మేధావులు ఊరుకోరు. లోపల ఒక మాట, బయట ఇంకో మాట మాట్లాడే రాజకీయ నాయకులను ప్రజలు బాగా పరిశీలిస్తారు. లోపల, బయట ఒకే మాదిరిగా మాట్లాడే వారినే ప్రజలు విశ్వసిస్తారు. అందుకే రాజకీయ నేతలు మాట్లాడే మాటలు సూటిగా ఉండాలి. విశ్వవ్యాప్తంగా కూడా రాజకీయంగా పెనుమార్పులు వస్తాయి. పెళ్లికాని ప్రసాదులకు (బ్రహ్మచారులకు) ఈ ఏడాది గడ్డుకాలం. సోలో బతుకు మంచిది అనుకుంటే కుదరదు. సంసార జీవితంలో ఉన్న వారికి శుభం జరుగుతుంది.
బంగారం ధర పెరుగుతుంది. షేర్మార్కెట్ ప్రతి ఏడాది మాదిరిగానే మన్మథ నామ సంవత్సరంలో కూడా ఒడిదుడుకులకు లోనవుతుంది. మత్స్య, కోళ్ల పరిశ్రమల వారు జాగ్రత్తగా ఉండాలి. నష్టాలొచ్చే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. సినిమా రంగం ఒడిదుడుకులకు లోనవుతుంది. పోలవరం ప్రాజెక్టు నాలుగేళ్ల ఒక్క నెల తరువాత కొంత ఆలస్యంగా ప్రారంభం అవుతుంది’ అని పంచాంగ శ్రవణంలో పేర్కొన్నారు.
జగన్కు పచ్చడి తినిపించిన చిన్నారులు
ఉగాది సందర్భంగా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. రామచంద్రశాస్త్రి వారికి పంచాం గాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమం ముగిశాక చిన్నారులు జగన్కు ఉగాది పచ్చడిని తినిపించారు. కార్యక్రమంలో పార్టీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ, నెల్లూరు ఎమ్మెల్యే పి.అనిల్కుమార్ యాదవ్, ముఖ్య నేతలు వి.విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎస్.రామకృష్ణారెడ్డి, పీఎన్వీ ప్రసాద్, ఇతర నేతలు కొండా రాఘవరెడ్డి, చల్లా మధుసూదన్రెడ్డి, మేడపాటి వెంకట్, కోటింరెడ్డి వినయ్రెడ్డి, కొల్లి నిర్మల, డాక్టర్ ప్రపుల్లరెడ్డి, అమృతాసాగర్, డాక్టర్ ఎ.భాస్కర్రెడ్డి, కె.ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.