
కుమార్తెపై తండ్రి లైంగిక దాడి
సభ్యసమాజం తలదించుకునేలా తండ్రే కూతురి పాలిట కాలయముడయ్యాడు. కొంతకాలంగా తనకు
♦ స్పందించని పెనమలూరు పోలీసులు
♦ తోట్లవల్లూరు వెళ్లాలని సూచన
పెనమలూరు/తోట్లవల్లూరు : సభ్యసమాజం తలదించుకునేలా తండ్రే కూతురి పాలిట కాలయముడయ్యాడు. కొంతకాలంగా తనకు దూరంగా ఉన్న కుమార్తెను బలవంతంగా తీసుకెళ్లి పలుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తన కుమార్తెను దౌర్జన్యంగా భర్త తీసుకువెళ్లాడని తల్లి పెనమలూరు పోలీసులకు గతంలో రెండుసార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేదు. మళ్లీ శుక్రవారం పెనమలూరు పీఎస్కు బంధువులు, సోషల్ యాక్షన్ కమిటీ సభ్యులతో ఫిర్యాదుచేసేందుకు వెళ్లగా కేసు పరిధి తమది కాదని తోట్లవల్లూకు పంపి స్థానిక పోలీసులు చేతులు దులుపుకొన్నారు. బాధితురాలి తల్లి విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. గోసాల సాయిబాబాగుడి కాలువకట్టకు చెందిన షేక్ రంజాన్బీ కొన్నేళ్ల కిందట వల్లూరుపాలేనికి చెందిన మస్తాన్వలిని వివాహం చేసుకుంది.
వీరికి ఇద్దరు పిల్లలు. వివాదాలతో విడిపోయి పదేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. పిల్లలు తల్లి వద్దే ఉంటున్నారు. కుమార్తె (15) ఈడుపుగల్లు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. రెండు నెలల క్రితం తండ్రి గోసాలకు వచ్చి భార్యతో తగాదాపడి పిల్లలను బలవంతంగా వల్లూరుపాలెం తీసుకెళ్లాడు. భర్తపై అనుమానంతో తల్లి పెనమలూరు పోలీసులకు రెండుసార్లు ఫిర్యాదుచేయబోగా పోలీసులు స్పందించలేదు. తండ్రి రాత్రి సమయంలో అనేకసార్లు కుమార్తెపై లైంగిక దాడి చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు.
మేనత్తకు తెలపగా ఆమె కూడా బెదిరించింది. దిక్కుతోచని స్థితిలో బాలిక వారం క్రితం గోసాలకు వచ్చి తల్లికి చెప్పి భోరుమంది. ఆత్మహత్య చేసుకుంటానని చెప్పగా తల్లి వారించింది. భర్తను నిలదీయగా తేలిగ్గా తీసుకోవడంతో చివరికి సోషల్ యాక్షన్ కమిటీ సభ్యులను ఆశ్రయించింది. వారితో కలిసి శుక్రవారం పీఎస్కు వెళ్లగా తోట్లవల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో శుక్రవారం సాయంత్రం బాధితురాలి తల్లి రమజాన్బీ తోట్లవల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయవాడ ఈస్ట్ ఏసీపీ అభిషేక్ మహంతి నేతృత్వంలో ఉయ్యూరు సీఐ మురళీరామకృష్ణ, ఎస్ఐ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.