పిల్లర్ గోతిలో పడి బాలుడి దుర్మరణం | The boy fell into the pit killed Pillar | Sakshi
Sakshi News home page

పిల్లర్ గోతిలో పడి బాలుడి దుర్మరణం

Sep 25 2014 2:54 AM | Updated on Aug 25 2018 4:52 PM

ఇబ్రహీంపట్నంలో పిల్లర్ నిర్మాణం కోసం తీసిన గోతిలో పడి ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

విషాదంలో తల్లిదండ్రులుఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నంలో పిల్లర్ నిర్మాణం కోసం తీసిన గోతిలో పడి ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.  స్థానిక ప్రసాద్ నగర్‌లో గోవాతి సుధాకర్, అనిత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు నాగేంద్రబాబు అలియాస్ మహేష్ (5) బుధవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ఆడుకుంటూ ఇంటి ఎదురుగా పిల్లర్ నిర్మాణం కోసం తవ్విన గోతిలో పడిపోయాడు. 6.30 గంటల సమయంలో అతడి గురించి తల్లికి ఆరా వచ్చి చుట్టుపక్కల వారిని అడిగింది.

ఆ సమయంలో గోతిలోనుంచి అరుపులు వినిపించాయి. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులు వచ్చి మహేష్ అందులో ఉన్నట్లు గుర్తించి రక్షించేందుకు యత్నించారు. వారు మొదట చాంతాడు ఇవ్వగా పట్టుకున్నాడు. అయితే జారి పడిపోయి మళ్లీ ఎక్కలేకపోయాడు. ఆ తర్వాత కేకలు వేయడం కూడా తగ్గిపోయింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై గణేష్ సిబ్బందితో ఘటనాస్థలికి వచ్చారు. వెంటనే జేసీబీని రప్పించి పక్కగా తవ్విస్తూ 10 అడుగుల లోతులో ఉన్న పిల్లవాడిని బయటకు తీశారు. వారు అందించిన సమాచారంతో 108 సిబ్బం ది వచ్చారు.

మహేష్‌కు ప్రథమ చికిత్సచేసి రక్షించేందుకు యత్నిం చారు. కొద్దిసేపటి తరువాత చనిపోయాడని తెలిపారు. బాలుడి మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి ఇబ్రహీంపట్నం సీఐ రాంబాబు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
ఎంత శ్రమించినా దక్కని ఫలితం

మహేష్‌ను కాపాడేందుకు స్థానికులు  కృషి చేశారు. మూ డు గంటల పాటు తీవ్రంగా శ్రమించినా బాలుడి ప్రాణాలు దక్కకపోవడంతో నిరాశ చెందారు. ప్రసాద్ నగర్‌కు చెందిన ఓ మహిళ  ఇంటి నిర్మాణం కోసం ఈ గోతులు తీయించింది. వాటిపై ఏమి కప్పకపోవడంతో మహేష్ ఆడుకుంటూ ఓ గోతిలో పడి మృతిచెందాడు.
 
విషాదంలో సుధాకర్ కుటుంబం

మహేష్ తండ్రి సుధాకర్  స్వస్థలం శ్రీకాకుళం జిల్లా పొందూరు. ఇబ్రహీంపట్నం వలస వచ్చి నూడిల్స్ బండి పెట్టుకుని వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సుధాకర్, అనిత దంపతులకు మహేష్‌తో పాటు శ్రీజ అనే కుమార్తె ఉంది. కుమారుడి అకాల మరణంతో దంపతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
 
అధికారుల పరామర్శ

సుధాకర్ కుటుంబసభ్యులను బుధవారం రాత్రి అధికారులు పరామర్శించారు. ఇబ్రహీంపట్నం తహశీల్దార్ హరిహరిబ్రహ్మాజీ, ఇబ్రహీంపట్నం సీఐ రాంబాబు, గ్రామ సర్పంచ్ అజ్మీరా స్వర్ణ, వార్డు సభ్యులు నల్లమోతు ప్రసాద్, రాయపూడి వెంకట్రావు, వైఎస్సార్ పార్టీ నాయకులు మధుబాబు, ఎన్.రవిలు పరామర్శించిన వారిలో ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement