ఔనా..! చోరీ చేశారా.. | One held, says he wanted to 'expose' security loopholes | Sakshi
Sakshi News home page

ఔనా..! చోరీ చేశారా..

Jan 28 2014 12:02 AM | Updated on Sep 4 2018 5:07 PM

ఔనా..! చోరీ చేశారా.. - Sakshi

ఔనా..! చోరీ చేశారా..

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ప్రముఖ బంగారు ఆభరణాల దుకాణంలో జరిగిన భారీ చోరీ కేసులో మండల కేంద్రం ఈపూరుకు చెందిన ఇద్దరు యువకులు నిందితులని ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న ఇక్కడి ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు.

ఈపూరు, న్యూస్‌లైన్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ప్రముఖ బంగారు ఆభరణాల దుకాణంలో జరిగిన భారీ చోరీ కేసులో మండల కేంద్రం ఈపూరుకు చెందిన ఇద్దరు యువకులు నిందితులని ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న ఇక్కడి ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు. అంతటి భారీ చోరీ చేసింది మా ఊరి యువకులా అంటూ వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. టాటా ఎంటర్‌ప్రైజస్‌కు చెందిన హైదరాబాద్ పంజాగుట్టలోని తనిష్క్ జువెలర్స్‌లో శుక్రవారం అర్ధరాత్రి సుమారు 23 కోట్లరూపాయల విలువైన బంగారు ఆభరణాలు దొంగలపాలయ్యాయి.

కేసును పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే ఈ చోరీని తానే చేశానంటూ కిరణ్‌కుమార్ అనే యువకుడు ప్రకటించడంతో పోలీసులు ఖంగుతిన్నారు. ఈపూరుకు చెందిన కిరణ్‌కుమార్ మరొకరితో కలిసి ఈ చోరీకి పాల్పడ్టట్టు వార్తలు వెలువడడంతో ఆ గ్రామ ప్రజలు ఒకింత కలవరపాటుకు గురయ్యారు.  నిన్న, మొన్నటి వరకు గ్రామస్తులతో కలిసి  తిరిగిన భూమన కిరణ్‌కుమార్, గంటినపాటి ఆనంద్‌లు చోరీ కేసులో కీలకపాత్ర పోషించారంటే నమ్మలేకపోతున్నామని అంటున్నారు. పిలిస్తేనే పలికే వారిద్దరు భారీ దొంగతనానికి ఒడిగట్టడానికి ఎలాంటి కారణాలు దారితీసివుంటాయనే దిశగా గ్రామస్తులు చర్చించుకోవడం మొదలు పెట్టారు.

 ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లారు..
 ఈపూరు మాలపాడుకు చెందిన యువకులు భూమన కిరణ్‌కుమార్, గంటినపాటి ఆనంద్‌లు ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లారు. పెయింటర్‌గా పనిచేసే కిరణ్‌కుమార్‌ను ఇక్కడ అంతా వివాదరహితుడిగా చెపుతున్నారు. తల్లి అన్నపూర్ణమ్మ కూరగాయలు అమ్ము తుంటారు. తల్లిదండ్రుల ఐదుగురు సంతానంలో పెద్ద కుమారుడు రవీంద్ర గుంటూరులోని సిమ్స్‌లో పని చేస్తున్నారు. రెండో కుమారుడు రాజు హైదరాబాద్‌లో పెయింటర్‌గా జీవిస్తున్నారు.

మూడో కుమారుడు ఆశోక్‌చక్రవర్తి మాచర్లలోని ప్రభుత్వ వైద్యశాలలో కాంట్రాక్టు ఉద్యోగి కాగా, ఐదవ కుమారుడు ప్రదీప్‌కుమార్ ఇంటి వద్దనే ఉంటున్నారు. నాల్గవ కుమారుడైన కిరణ్‌కుమార్ తనిష్క్ జువెలర్స్‌లో భారీ చోరీ చేయడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏనాడూ  ఈపూరు పోలీసు స్టేషన్ మెట్లు కూడా ఎక్కలేదంటున్నారు. అతని బంధువు ఆనంద్ జనవరి 1న హైదరాబాద్ వెళ్ళినట్టు చెబుతున్నారు.

 అయితే ఆనంద్‌కు మతిస్థిమితం సరిగా ఉండదని చెపుతున్నారు. వికలాంగుడైన ఆనంద్ చోరీ కేసులో ఉండడాన్ని నమ్మలేకపోతున్నామని అంటున్నారు. ఆనంద్ తండ్రి శామ్యూల్ తాపీ మేస్త్రీగా పని చేస్తున్నారు. స్థానికంగా మిర్చిబస్తాలు మోసే కూలీగా పనిచేసిన కిరణ్ తండ్రి 2011లో పంచాయతీ ఎన్నికల్లో  వార్డు సభ్యునిగా గెలుపొందారు. ఆ తరువాత గుండెపోటుతో మరణించారు.

 టీడీపీలో కలకలం
 ‘తనిష్క్’  జువెలర్స్‌లో చోరీకి పాల్పడి పోలీసుల ఎదుటకొచ్చిన భూమన కిరణ్‌కుమార్ వ్యవహారం జిల్లా టీడీపీ శ్రేణుల్లో కలకలానికి దారితీసింది. వినుకొండ నియోజకవర్గం  మండల కేంద్రం ఈపూరుకు చెందిన కిరణ్ స్థానికంగా టీడీపీలో క్రియాశీలక కార్యకర్తగా ఉన్నాడు. అతని తండ్రి 2011లో టీడీపీ తరఫున పంచాయతీ వార్డు సభ్యునిగా పనిచేస్తూ గుండెపోటుతో మరణించారు. ప్రస్తు తం కిరణ్ మేనమామ కూడా ఆ పార్టీ తరఫున క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమపార్టీకి చెందిన కార్యకర్త భారీ చోరీ కేసులో నిందితుడవడంపై నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇప్పటి కే జిల్లాలో సీనియర్ టీడీపీ నేతలు డాక్టర్ కోడెల శివప్రసాదరావు, గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతో పాటు అదే పార్టీకి చెందిన పలువురు నేతలు క్రిమినల్ కేసుల్లో ఉండడం, రానున్న ఎన్నికల్లో ఓటింగ్‌ను దెబ్బతీసే అంశాలుగా పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. తాజాగా, దోపిడీ కేసులో ప్రధాన నేరస్తునిగా ప్రకటించుకున్న కిరణ్.. నేటి రాజకీయాల్లో తాను దగ్గరగా చూసిన నేతల అవినీతి, దోపిడీని ప్రస్తావించడం టీడీపీ నేతలకు మరింత షాక్‌నిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement