
నూకాంబిక ఆలయంలో విభేదాల రచ్చ
నూకాంబిక అమ్మవారి ఆలయ వర్గాల మధ్య కుమ్ములాటలు రచ్చకెక్కాయి. అనకాపల్లి నూకాంబిక దేవస్థానం చైర్మన్ బొడ్డేడ అప్పారావు ఆలయ కార్య నిర్వహణాధికారి సుజాతపై ఆరోపణలకు తెరతీశారు.
- ఈఓపై చైర్మన్ ఆరోపణలు
- దీటుగా స్పందించిన ఈవో
అనకాపల్లి : నూకాంబిక అమ్మవారి ఆలయ వర్గాల మధ్య కుమ్ములాటలు రచ్చకెక్కాయి. అనకాపల్లి నూకాంబిక దేవస్థానం చైర్మన్ బొడ్డేడ అప్పారావు ఆలయ కార్య నిర్వహణాధికారి సుజాతపై ఆరోపణలకు తెరతీశారు. 17 అంశాలకు సంబంధించిన ప్రశ్నావళితో చైర్మన్ ఆలయ కార్యనిర్వహణాధికారిపై ఆరోపణల అస్త్రాన్ని సంధించగా, ఆలయ కార్యనిర్వహణాధికారి సుజాత సైతం దీటుగానే సమాధానమిచ్చారు. నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవ సమయంలో విభేదాలు గుప్పుమన్నాయి.
ఈలోపు ఎన్నికలు రావడం, కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో కాస్త సద్దుమణిగినా, తాజాగా ఈవోపై ఆరోపణలు గుప్పిస్తూ చైర్మన్ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేయడంతో పరిస్థితి రచ్చకెక్కింది. ఈ నేపధ్యంలో సోమవారం నూకాంబిక దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి సుజాత పత్రికా సమావేశం నిర్వహించి చైర్మన్ చేసిన ఆరోపణలపై అంశాలవారీగా వివరణ ఇచ్చారు.
మొదట్లో చైర్మన్ పాలకవర్గం అధికారులతో సఖ్యతగా మెలిగి ఆలయ అభివృద్ధికి పనిచేసినప్పటికీ తదనంతర కాలంలో ఆలయ వర్గాల మధ్య నెలకొన్న విభేదాల కారణంగా కొన్ని పనుల పురోగతి నిలిచిపోయింది. దీనికి బడ్జెట్ ఆమోదం లేకపోవడం కూడా కారణమయింది. ఇదిలావుండగా ప్రస్తుత పాలకవర్గాలను రద్దు చేసేందుకు క్యాబినెట్ నిర్ణయించడంతో మరికొద్ది రోజుల్లో కొత్త పాలకవర్గం కొలువు దీరనుంది. ఇదే సమయంలో ఈఓ సుజాత సైతం బదిలీపై వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
అధికారం, పరిమితుల మేరకే వ్యవహరించా : ఈవో సుజాత
నూకాంబిక దేవస్థాన అభివృద్ధిలోను, కార్యకలాపాల్లోను సహకరించలేదని చైర్మన్ బొడ్డేడ అప్పారావు తనపైచేసిన ఆరోపణలు అవాస్తవమని దేవస్థాన కార్యనిర్వహణాధికారి సుజాత తెలిపారు. ఈ మేరకు తన కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో చైర్మన్ సంధించిన 17 ప్రశ్నలకు అంశాల వారీగా సమాధానమిచ్చారు. తన అధికారం, పరిమితుల మేరకు వ్యవహరించానని, ఎవరి పట్ల నిర్లక్ష్య భావన లేదని స్పష్టం చేశారు. తనపై చేసిన ఆరోపణలకు ఎటువంటి దర్యాప్తుకైనా సిద్ధమని పేర్కొన్నారు.