అన్నాచెల్లెలిపై హత్యాయత్నం

murder attempt to brother and sister - Sakshi

మదనపల్లె క్రైం /ములకలచెరువు : పొలాన్ని ట్రాక్టర్‌తో దుక్కి చేస్తున్న యువకుడు, అతని చెల్లిపై ప్రత్యర్థులు కొడవలితో నరికి హత్యా చేసేందుకు యత్నించారు. అడ్డు వచ్చిన బాధితురాలి భర్తపైనా దాడి చేశారు. ఈ సంఘటన శనివారం ములకలచెరువు మండలంలో జరిగింది. సీఐ రుషికేశవ్‌ కథనం మేరకు.. పెద్దపాళ్యం పంచాయతీ మలిగివారిపల్లెకు చెందిన దామోదర్‌ పదేళ్ల క్రితం మదనపల్లె పట్టణం ముగ్గురాళ్ల వంకకు చెందిన రెడ్డెప్ప కుమార్తె అరుణమ్మను పెళ్లి చేసుకున్నాడు. అరుణమ్మకు చల్లా మణి(25) అనే సోదరుడు ఉన్నాడు. అతను డ్రైవర్‌గా పనిచేస్తాడు. దామోదర్‌ రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతుండడంతో అరుణమ్మ పొలం దున్నేందుకు అన్నను పిలిపించుకుంది. మణి తన సోదరి అరుణమ్మతో కలిసి శనివారం పొలంలో ట్రాక్టర్‌తో దున్నుతున్నారు. 

అదే సమయంలో గ్రామానికి చెందిన జయరాం, రత్నమ్మ పొలం తమదని, అందులో దుక్కి దున్నడానికి వీళ్లేదని మణిని ఆక్షేపించారు. మణి పట్టించుకోలేదు. దీంతో జయరాం కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. జయరాంను అరుణమ్మ నిలదీసింది. ఆగ్రహించిన జయరాం భార్య రత్నమ్మ, కుమార్తెలు వెంట తెచ్చుకున్న కారం పొడి చల్లి వేట కొడవలితో ఇద్దరిపై దాడి చేశారు. జయరాం కొడవలితో విచక్షణ రహితంగా మణిని నరికాడు. సమాచారం అందుకుని అక్కడికి వచ్చిన అరుణమ్మ భర్త దామోదర్‌పైనా దాడి చేశారు. వారిని స్థానికులు 108 ద్వారా మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మణి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వైద్యులు తిరుపతికి రెఫర్‌ చేశారు. ములకలచెరువు సీఐ రుషికేశవ్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top