పేదరాలి రేషన్ కార్డు ఆధారంగా పక్కా గృహం బిల్లు అక్రమంగా పొందిన ఓ పెద్దకు శ్రీముఖం(నోటీసు) బుధవారం జారీ అయిందని సమాచారం.
సిద్దిపేట, న్యూస్లైన్: పేదరాలి రేషన్ కార్డు ఆధారంగా పక్కా గృహం బిల్లు అక్రమంగా పొందిన ఓ పెద్దకు శ్రీముఖం(నోటీసు) బుధవారం జారీ అయిందని సమాచారం. ‘ఇల్లు రాసుకోండి..పైసల్ తీసుకోండి..’ శీర్షికన ఈ నెల ఏడో తేదీన, ‘అవకతవకల గూడు’ పేరిట ఎనిమిదో తేదీన సదరు నాయకుడి నిర్వాకాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో సిద్దిపేట హౌసింగ్ అధికారులు విచారణ చేపట్టారు. ‘సాక్షి’ ప్రచురించిన కథనం నిజమనేని నిర్ధారించారు. చంద్లాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద వ్యవసాయ కూలి రాదారం పోచవ్వకు చెందిన రేషన్కార్డుతో ఇంటి నిర్మాణ బిల్లును సదరు నేత కాజేసినట్లు గృహ నిర్మాణ సంస్థ అధికారులు తేల్చారు. దీంతో హౌసింగ్ డీఈఈ సత్యనారాయణ ఆదేశాల మేరకు ఏఈ ఆకుల మహేందర్ సదరు వ్యక్తికి తాఖీదు పంపిస్తున్నారని తెలుస్తోంది.
ఓ మెస్సెంజర్(సిబ్బంది) ద్వారా నోటీసు అందజేతకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. చట్ట విరుద్ధంగా డ్రా చేసుకున్న డబ్బులు రూ.43,650 తిరిగి చెల్లించాలని ఆ నోటీసులో స్పష్టం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ పేరిట డీడీ తీసి పంపాలని, ఇందుకు పది రోజుల గడువు ఇస్తున్నట్లు నోటీసులో ప్రస్తావించారని తెలియవచ్చింది. నిర్లక్ష్యం చేస్తే చట్ట ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు. ఓ వైపు అక్రమ లబ్ధిదారుకు నోటీసు విడుదల చేసిన అధికారులు అదే సమయంలో అసలైనƒ, అర్హురాలు పోచవ్వకు లబ్ధి చేకూర్చే ప్రక్రియ కూడా ప్రారంభించారని సమాచారం. ఆమెకు ఇల్లు మంజూరు చేసేందుకు డీఈఈ, ఏఈ ప్రత్యేక చొరవ చూపుతున్నారని తెలుస్తోంది.