రాష్ట్ర విభజన కోసం రాజ్యాంగంలో నిర్దేశించిన అధికరణ 3కు 1955లో తీసుకొచ్చిన ఐదో సవరణను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది.
-
కౌంటర్ల దాఖలుకు కేంద్రాన్ని ఆదేశించిన ధర్మాసనం
-
విభజన బిల్లుపై లగడపాటి పిటిషన్ విచారణకు నిరాకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన కోసం రాజ్యాంగంలో నిర్దేశించిన అధికరణ 3కు 1955లో తీసుకొచ్చిన ఐదో సవరణను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది. ఈ పిల్లో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర కేబినెట్ కార్యదర్శి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి తదితరులకు నోటీసులు జారీ చేసింది.
పూర్తి వివరాలతో మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్జ్యోతి సేన్గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్కుమార్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్లకు మరో రెండు వారాల్లో తిరుగు సమాధానం (రిప్లై) ఇవ్వాలని పిటిషనరైన న్యాయవాది పీవీ కృష్ణయ్యను ఆదేశించింది.
అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు ఆమోదముద్ర వేస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగంలోని అధికరణ 3కు విరుద్ధమంటూ కాంగ్రెస్ బహిష్కృత ఎంపీ లగడపాటి రాజగోపాల్, మాజీ ఎంపీ సీహెచ్ శ్రీహరిరావు దాఖలు చేసిన మరో పిటిషన్ను విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది. పిటిషనర్లలో ఒకరు ఎంపీ కాబట్టి, తన అభిప్రాయాలను అక్కడే లేవనెత్తాలని సూచించింది.